హుస్సేన్సాగర్ చుట్టూ నైట్ బజార్ ఏర్పాటు చేయబోతున్నామని మంత్రి కేటీఆర్(KTR on Urban Development) తెలిపారు. హెచ్ఎండీఎ ఆధ్వర్యంలో రూ. 37కోట్లతో ట్యాంక్బండ్ను ఆధునీకరించినట్లు చెప్పారు. నగరంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా సర్వీస్ రోడ్లను విస్తరిస్తున్నామని చెప్పారు. పట్టణ ప్రగతిలో భాగంగా భాగ్యనగరంలో ప్రధానంగా ఉన్న సమస్యల పరిష్కరణ.. నగర అభివృద్ధికి చేపడుతున్న పనుల గురించి శాసనమండలిలో కేటీఆర్ వివరించారు.
రాష్ట్రవ్యాప్తంగా తాగునీటిపై రూ.వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. రాష్ట్రంలో 13.50 లక్షల నీటి కనెక్షన్లు ఇస్తున్నాం. ప్రతి ఇంటికి 20 వేల లీటర్ల నీటిని ఉచితంగా సరఫరా చేస్తున్నాం. ఉచిత తాగునీటి సరఫరాతో 4 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతోంది. స్వచ్ఛ తెలంగాణ కార్యక్రమంలో భాగంగా 37 లక్షల బుట్టలు పంపిణీ చేశాం. స్వచ్ఛ హైదరాబాద్లో మున్సిపాలిటీలు, పారిశుద్ధ్య కార్మికుల కృషి ఎనలేనిది. -కేటీఆర్, ఐటీ, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి
రోజురోజుకూ నగరం మరింత విస్తరిస్తోందని.. కొత్త కొత్త కాలనీలు వస్తున్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. పౌరులను భాగస్వాములను చేస్తూ అనేక కార్యక్రమాలను చేపట్టామని చెప్పారు. పట్టణాలు ఆర్థిక చోదక శక్తులని.. రాష్ట్రానికి సంబంధించి 65 నుంచి 75శాతం జీఎస్డీపీ హైదరాబాద్ నుంచే వస్తోందని తెలిపారు. గతంలో నగర శివారుల్లో పది పదిహేను రోజులకోసారి తాగునీరు వచ్చేదని.. కానీ ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ అవతరించాక రోజు మార్చి రోజు తాగునీరు సరఫరా చేస్తున్నామని చెప్పారు. భవిష్యత్తులో నగరవాసులకు ప్రతిరోజు తాగు నీరు అందించేలా చర్యలు తీసుకుంటామని కేటీఆర్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి: TELANGANA CM KCR: హైదరాబాద్లో అపారనష్టం జరిగితే కేంద్రం పైసా ఇవ్వలేదు: కేసీఆర్