రాష్ట్రంలో పేదింటి ఆడపిల్లల వివాహాలకు ఆర్థిక సాయం అందించేందుకు ఉద్దేశించిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ దరఖాస్తుల పరిష్కారం ఆలస్యమవుతోంది. కరోనా కాలంలో జరిగిన వివాహాలకు సంబంధించిన అర్జీలు వివిధ దశల్లో నిలిచిపోయాయి. అన్లాక్ ప్రక్రియ మొదలైన తర్వాత అవసరమైన పత్రాలతో పేద తల్లిదండ్రులు దరఖాస్తు చేస్తున్నా.. ఎమ్మెల్యేలు, ఎమ్మార్వోలు, ఆర్డీవోల వద్ద పెండింగ్లో ఉంటున్నాయి.
రూ. 1,115 కోట్లు అవసరం...
2020-21లో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు 1.59 లక్షల మంది దరఖాస్తు చేశారు. అంతకుముందు పెండింగ్ వాటితో కలిపి మొత్తం దరఖాస్తుల సంఖ్య 2.63 లక్షలకు చేరుకోగా.. ఇప్పటి వరకు అందులో 1.51 లక్షల దరఖాస్తులు పరిష్కారమయ్యాయి. వీటి కోసం ఇప్పటికే రూ.1,502 కోట్లను ప్రభుత్వం చెల్లించగా.. మిగతా 1.12 లక్షల దరఖాస్తుల పరిష్కారానికి రూ.1,115 కోట్లు అవసరమని అంచనా.
ధ్రువీకరణ...
45 రోజుల్లోగా అర్హుల దరఖాస్తులను పరిష్కరించి.. రూ.1,00,116 ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం గతంలోనే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు జిల్లాల్లో ఇప్పటికే అవసరమైన పత్రాలతో లబ్ధిదారులు దరఖాస్తు చేశారు. కొందరు తహసీల్దార్లు వివాహపత్రిక, ఫొటోల స్థానంలో రిజిస్ట్రేషన్ ధ్రువీకరణ కావాలని కోరుతున్నారు.
సాంకేతిక సమస్యలు...
సాంకేతిక సమస్యలూ ఆలస్యానికి కారణమవుతున్నాయి. కరోనా కారణంగా దరఖాస్తుల పరిష్కారం, చెల్లింపులు కొంత ఆలస్యమవుతున్నాయని సంక్షేమ వర్గాలు చెబుతున్నాయి. మిగతా నిధులు విడుదలైతే అర్హులైన వారికి సహాయం అందుతుందని పేర్కొంటున్నాయి. మరోవైపు దరఖాస్తులను పరిష్కరించినప్పటికీ ట్రెజరీలో రూ.92 కోట్లు నిధులు నిలిచిపోయాయి. ఈ నిధులు విడుదలైతే మరో 9 వేల మందికి ఆర్థిక సహాయం లభించనుంది.
ఎవరి దగ్గర ఎన్ని దరఖాస్తులు పెండింగ్..?
* తహసీల్దారు కార్యాలయాలు 36 వేలు
* ఎమ్మెల్యేల ధ్రువీకరణ కోసం.. 21 వేలు
* ఎమ్మెల్యేల ఆమోదం పొందినప్పటికీ నిధుల కొరతతో ఆర్డీవోల వద్ద నిలిచిపోయినవి దాదాపు 51 వేలు
ఇదీ చూడండి: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడే నోటిఫికేషన్