కోట్ల మందికి ప్రాతినిధ్యం వహించే ప్రధాని అనూహ్య నిర్ణయాలు ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. వలస కార్మికులను స్వస్థలాలకు పంపించిన తర్వాత లాక్డౌన్ ప్రకటిస్తే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ మఖ్దూం భవన్లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి, మాజీ ఎంపీ అజీజ్పాషాలతో కలిసి ఆయన దీక్షకు దిగారు.
రేషన్ కార్డు లేకున్నా వలస కార్మికులకు బియ్యం ఇస్తామని చెప్పి విస్మరించారని నారాయణ ఆరోపించారు. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో మద్యం దుకాణాలు తెరుచుకోవచ్చని కేంద్రం ప్రకటించడం సరైంది కాదని వ్యాఖ్యానించారు. లాక్డౌన్ ఎత్తివేసే వరకు మద్యం దుకాణాలు బంద్ చేయాలని డిమాండ్ చేశారు.
రైతుల సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించాలని సూచించారు. ఒకవేళ పరిష్కరించకపోతే లాక్డౌన్ను అతిక్రమించి ప్రత్యేక పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. నాయకుల దీక్ష సాయంత్రం 5 వరకు కొనసాగనుంది.
ఇవీ చూడండి: భద్రాద్రిలో మంటలు.. భయాందోళనలో ప్రజలు