తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ(టీఎస్టీడీసీ) అలేఖ్య హారిక (దేత్తడి ఫేం)ను బ్రాండ్ అంబాసిడర్గా నియమించడం వివాదాస్పదమైంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోకుండా నియామకం చేపట్టారంటూ ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న హారికను బ్రాండ్ అంబాసిడర్గా నియమిస్తూ పర్యాటక అభివృద్ధి సంస్థ ఛైర్మన్ ఉప్పల శ్రీనివాస్గుప్తా ఆమెకు నియామక పత్రం అందించారు. ఈ నిర్ణయం వివాదం కావడంతో ముఖ్యమంత్రి కార్యాలయం పర్యాటక అభివృద్ధి సంస్థను వివరణ అడిగింది. ఈ పరిణామాల నేపథ్యంలో శ్రీనివాస్గుప్తా టీఎస్టీడీసీ ఎండీ మనోహర్తో కలిసి మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ‘కొవిడ్ కాలంలో పర్యాటక అభివృద్ధి సంస్థ హోటళ్లు, బస్సులు, బోట్లు నడవలేదు. తెలంగాణ టూరిజం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసుకునేందుకు తక్కువ ఖర్చుతో ప్రచారం చేయడంలో భాగంగానే హారికను నియమించాం. ఆమె తెలంగాణ బిడ్డ. సామాజిక మాధ్యమాల్లో మంచి పేరుంది. సామాజిక మాధ్యమాల్లో ప్రచారం అవసరమైన రోజుల్లోనే ఆమె సేవలను వినియోగించుకుంటాం. ఆ సేవలకే చెల్లింపులు చేస్తాం. రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ అంబాసిడర్గా హారిక ఉంటారు’ అని శ్రీనివాస్గుప్తా వివరించారు.
- ఇదీ చదవండి: బీమా సొమ్ము కోసం హత్యలు చేస్తున్న ముఠా అరెస్టు