వరంగల్ కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్లో మరో ఆర్నెళ్లలో తమ ఫ్యాక్టరీల నిర్మాణం పూర్తి కానుందని కొరియా దేశానికి చెందిన ప్రముఖ కంపెనీ యంగ్వాన్ తెలిపింది. మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, పరిశ్రమలశాఖ ఉన్నతాధికారులతో యంగ్వాన్ కంపెనీ ఛైర్మన్ సుంగ్ దృశ్యమాధ్యమ సమావేశంలో పాల్గొన్నారు. ఇప్పటికే ప్రకటించిన విధంగా కంపెనీ పెట్టుబడి ప్రణాళిక కొనసాగుతుందన్న ఆయన... రానున్న ఆర్నెళ్లలో టెక్స్ టైల్ పార్కులో ఐదు ఫ్యాక్టరీల నిర్మాణం పూర్తి చేస్తుందని వివరించారు.
వరంగల్ వేదికగా...
రెండో దశలో మరో మూడు ఫ్యాక్టరీలు నిర్మిస్తామని చెప్పారు. ఇప్పటికే ఫ్యాక్టరీల నిర్మాణం పూర్తికావాల్సి ఉన్నప్పటికీ కరోనా, అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న సందిగ్ధత కారణంగా ఆలస్యమైందని సుంగ్ తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో అన్నీ మెరుగుపడతున్నాయని, భారతదేశంలో తమ కార్యకలాపాలను వరంగల్ వేదికగా ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. అత్యంత వేగంగా ఫ్యాక్టరీలను పూర్తి చేసేందుకు కంపెనీ కట్టుబడి ఉందని... వరంగల్ టెక్స్టైల్ పార్క్లో పెట్టుబడి ప్రకటన నుంచి ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం తమకు అన్ని విధాలుగా బాసటగా నిలుస్తూ వస్తోందని సుంగ్ ప్రశంసించారు.
మేడిన్ తెలంగాణ...
యంగ్వాన్ కంపెనీ వరంగల్ టెక్స్ టైల్ పార్కులో ఫ్యాక్టరీలను త్వరలో పూర్తి చేయడం కేవలం తెలంగాణలోనే కాకుండా భారతదేశ టెక్స్టైల్ రంగంలోనే ఒక మైలురాయిగా నిలిచిపోతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఆరు నెలల తర్వాత ప్రపంచానికి మేడిన్ తెలంగాణ వస్త్రాలు కాకతీయ టెక్స్ టైల్ పార్క్ నుంచి అందుతాయని తెలిపారు. టెక్స్టైల్ పార్కులో మరిన్ని కొరియన్ కంపెనీలు పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందన్నారు. ఫ్యాక్టరీల నిర్మాణానికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తామని యంగ్వాన్ కంపెనీ ఛైర్మన్ సుంగ్కు కేటీఆర్ హామీ ఇచ్చారు. స్థానిక వరంగల్ ప్రజలకు ఉపాధి అవకాశాలు లభించేలా చర్యలు తీసుకోవాలని... స్వయం సహాయక సంఘాలు, మహిళలకు తగిన శిక్షణ ఇవ్వాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కోరారు.
సుమారు 12 వేల మందికి...
యంగ్వాన్ కంపెనీ కార్యకలాపాలకు అవసరమైన విధంగా నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు పరిశ్రమలశాఖ సిద్ధంగా ఉందని కేటీఆర్ తెలిపారు. మొత్తం ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తైతే సుమారు 12 వేల మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయని... కంపెనీ ఉద్యోగాల్లో అత్యధికం మహిళలకే దక్కుతాయని చెప్పారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రానున్న రెండు, మూడు నెలల్లో శిక్షణ కార్యక్రమాలు ప్రారంభించనున్నట్లు మంత్రులు తెలిపారు.