నిత్యావసర వస్తువులు అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని పౌరసరఫరాల శాఖ కమిషనర్ పి.సత్యనారాయణరెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ పౌరసరఫరాల భవన్లో టోకు వర్తకులు, వ్యాపారస్తులతో సమీక్ష నిర్వహించారు. పప్పు ధాన్యాలు, చక్కెర, వంట నూనెలు, ఎండు మిర్చి, పసుపు, చింత పండు, ఉప్పు తదితర వస్తువుల నిల్వలు ఏ విధంగా ఉన్నాయి..? ఎప్పటి వరకు సరిపోతాయి..? ఎక్కడి నుండి దిగుమతి అవుతున్నాయి..? వంటి అంశాలను వ్యాపారులను అడిగి తెలుసుకున్నారు కమిషనర్.
సరుకుల రవాణాలో సమస్యలు
మహారాష్ట్ర, కర్ణాటక నుంచి చక్కెర, గుజరాత్ నుంచి ఉప్పు, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ నుంచి శనగ పప్పు, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి కందిపప్పు, రాజస్థాన్ నుంచి పెసరపప్పు, కృష్ణపట్నం, కాకినాడ, చెన్నై ఓడరేవుల నుంచి ముడి వంట నూనెలను నిరంతరం దిగుమతి చేసుకుంటున్నామని వ్యాపారులు తెలిపారు. సరుకుల రవాణాలో సమస్యలు ఎదురవుతున్న దృష్ట్యా... అవి పరిష్కరించాలని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు.
రవాణా సమస్యలు ఎదురైతే...
చెక్ పోస్టుల దగ్గర సరుకుల రవాణా వాహనాలను నిలిపి వేస్తే డ్రైవర్ పేరు, వాహనం నంబర్ తెలియజేస్తే వెంటనే సమస్యను పరిష్కరిస్తామని కమిషనర్ తెలిపారు. రవాణాలో ఎలాంటి అవరోధాలు ఎదురు కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రవాణా సమస్యలు ఎదురైతే హైదరాబాద్లోని సీఆర్డీ కార్యాలయంలో 040 23447770కు ఫిర్యాదు చేయాలని సూచించారు.
ప్రభుత్వానికి సహకరించండి
మిర్యాలగూడ నుంచి 800 టన్నుల బియ్యం వస్తాయని... హమాలీల కొరతతో ఆగిపోయాయని వ్యాపారులు చెప్పారు. వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడిన కమిషనర్.. సమస్య పరిష్కారానికి తగిన ఆదేశాలు జారీ చేశారు. కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు అమ్మవద్దని.. కొవిడ్-19 ప్రబలుతున్న క్లిష్టమైన పరిస్థితుల్లో వ్యాపార ధోరణితో కాకుండా మానవతా దృక్పథం, సామాజిక బాధ్యతగా పనిచేయాలని కమిషనర్ సత్యనారాయణరెడ్డి సూచించారు. ఈ విషయంలో ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అధిక ధలపై విజిలెన్స్ బృందాలు ప్రత్యేకంగా నిఘా వేశాయని... అధిక ధరలకు విక్రయించినట్లు తేలితే పీడీ యాక్టు నమోదు చేస్తామని హెచ్చరించారు.
ఇవీచూడండి: 'ఆ పన్నెండు సూత్రాలు పాటిస్తేనే కరోనా కట్టడి సాధ్యం'