కృష్ణా జిల్లాలోని మూలపాడు అటవీ ప్రాంతం పచ్చని అందాలను పరచుకుని ప్రకృతి ప్రేమికులను ఆకర్షిస్తుంటుంది. ప్రత్యేకంగా సీతాకోకచిలుకల కోసమే చాలా మంది మూలపాడు అటవీ ప్రాంతంలోకి వెళ్తుంటారు. అందుకే వాటిని వెతుక్కుంటూ ప్రకృతి ప్రియులు అడవి బాట పట్టకుండా సీతాకోకచిలుకలనే సందర్శకుల చెంతకు తీసుకొచ్చేందుకు అటవీ శాఖ పనులు మొదలుపెట్టింది. మూలపాడు వద్ద సీతాకోకచిలుకల ఉద్యానవనాన్ని సిద్ధం చేస్తోంది.
మూలపాడు అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్న ఈ ఉద్యానవనం సీతాకోకచిలుకలకు ప్రత్యేకం. కొన్ని ప్రత్యేకమైన మొక్కలు సీతాకోకచిలుకలను ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటాయి. అలాంటి మొక్కలను కడియం సహా వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ నాటుతున్నారు. సూర్యోదయం అవుతూనే ఈ మొక్కల కోసం సీతాకోకచిలుకలు మూలపాడు అడవుల నుంచి ఇక్కడికి పరుగున వస్తున్నాయి. మూలపాడు అటవీ ప్రాంతంలో వెళ్లే మార్గం ప్రారంభంలోనే ఈ ఉద్యానవనం సిద్ధమవుతోంది. ప్రస్తుతానికి ఇది నిర్మాణ దశలోనే ఉన్నందున సందర్శకులకు అనుమతి లేదు.
ఈ ఉద్యానవనం పేరే సీతాకోకచిలుకల పార్కు. సందర్శకులు సేదతీరేందుకు పార్కు అంతటా సీతాకోకచిలుకల ఆకారంలో బల్లలు ఏర్పాటు చేశారు. అటవీ అందాల నడుమ సీతాకోకచిలుకల సోయగాలు చూసేందుకు వచ్చే వారిని మరింతగా ఆకట్టుకునేందుకు అటవీ శాఖ ఈ ఉద్యానవనానికి అన్ని హంగులు అద్దుతోంది. అటవీ శాఖ ఆంధ్రప్రదేశ్ బర్డ్సు సొసైటీ సహకారంతో ఈ ఉద్యానవానాన్ని సిద్ధం చేస్తోంది. ప్రస్తుతానికి ఈ ఉద్యానవనం సీతాకోకచిలుకలకు ఆతిథ్యమిస్తున్నా సందర్శకులకు ఆహ్వానం పలికేందుకు మాత్రం మరికొంత కాలం పట్టనుంది.
ఇదీ చూడండి :బుజ్జి జింకను కాపాడిన పెద్ద మనసులు!