రైతులు, కిసాన్ మోర్చా నాయకులతో కలిసి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay ).. భాజపా రాష్ట్ర కార్యాలయంలో రైతు దీక్ష (bjp rythu deeksha) చేశారు. గాంధీ చిత్ర పటం వద్ద నివాళులు అర్పించి దీక్షకు కూర్చున్నారు. వరి సాగుపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రైతు ఈ దీక్ష చేపట్టారు. మధ్యాహ్నం రెండు గంటల వరకు రైతుదీక్ష కొనసాగించారు. సీఎం రైతులను గందరగోళానికి గురిచేస్తున్నారని చేస్తున్నారు. సీఎం గందరగోళంతో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆరోపించారు.
''ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులను గందరగోళానికి గురుచేస్తున్నారు. ప్రతిగింజ కొనుగోలు చేస్తామని సీఎం గతంలో చెప్పారు. నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించారా? రైతులను తెరాస ప్రభుత్వం ఆదుకుందా? రాష్ట్రంలో ఆకలి చావులు చోటుచేసుకుంటున్నాయి. ధాన్యం కొనుగోళ్లపై రాష్ట్రప్రభుత్వమే నిర్ణయించి కేంద్రానికి చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వం మధ్యవర్తిత్వం మాత్రమే చేయాలి. మిగితాది కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. ఏ ఉద్దేశంతో వరి సాగు చేయొద్దని రాష్ట్రప్రభుత్వం చెబుతోంది. సీఎం కేసీఆర్ వల్ల నలుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. రైతులకు అవగాహన కల్పించి శిక్షణ ఇవ్వాలి. భూసార పరీక్షలు నిర్వహించాలి. ప్రతిపక్షాలు రైతులపక్షాన మాట్లాడితే రాజకీయ కోణం అంటున్నారు.
కేంద్రం వరి కొనేందుకు సిద్ధంగా ఉంది. సీఎం కేసీఆర్ మాటల్ని రైతులు నమ్మవద్దు. సీఎం రైతులను గందరగోళానికి గురిచేస్తున్నారు. రుణమాఫీ లేదు, రైతుబంధు లేదు, ఉచిత యూరియా లేదు. కేంద్రం నుంచి ఎవరు లేఖ రాశారో తెలపాలి. లేకపోతే సీఎం కేసీఆర్ రాజీనామా చేయాలి. ఇవాళ దీక్ష చేస్తున్నాం, రేపట్నుంచి ఆందోళన చేస్తాం.''
-బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
రైతు దీక్షలో భాజపా నాయకులు ప్రేమేందర్ రెడ్డి, పొంగులేటి సుధాకర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు. తెరాస ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాల్ని విడనాడాలన్న డిమాండ్తో ముఖ్యమంత్రి కేసీఆర్పై ఒత్తిడి తెచ్చేందుకు సంజయ్ ఈ దీక్ష చేస్తున్నట్టు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్రెడ్డి తెలిపారు.