ముఖానికి మాస్కులు లేకుండా బయటికొస్తున్న వారికి పోలీసులు జరిమానా విధిస్తున్నారు. రద్దీ ప్రాంతాల్లో మాస్కులు లేకుండా ఉన్న వాళ్లను పోలీసులు గుర్తించి వారిపై పెట్టీ కేసు నమోదు చేసి చలాన్లు రాస్తున్నారు. ఈనెల 7 నుంచి 19 వరకు 16 వేల మందికిపైగా జరిమానాలు విధించారు. మాస్కులు తప్పని సరి చేసిన తర్వాత మొదటి వారం రోజుల్లో కేవలం 4700 కేసులే నమోదయ్యాయి. తర్వాత ఆరు రోజుల్లో ఏకంగా 11,500 కేసులు నమోదు చేశారు.
దగ్గినా, తుమ్మినా
కరోనా వైరస్ ఉన్న వాళ్లు దగ్గినా, తుమ్మినా వారి నుంచి వైరస్ మరొకరికి వెంటనే వ్యాప్తిస్తుంది. దానిని నివారించేందుకు ప్రభుత్వం మాస్కును తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రద్దీ ప్రాంతాలకు వచ్చే ప్రతి ఒక్కరూ ఎట్టి పరిస్థితుల్లోనూ మాస్కులు ధరించాల్సిందేననే నిబంధన విధించారు.
కనీసం చేతిరుమాలు..
మాస్కులు అందుబాటులో లేకుంటే కనీసం చేతిరుమాలైనా ధరించాలని ప్రభుత్వం సూచించింది. ఆ మేరకు పోలీసులు మాస్కులు ధరించని వాళ్లను గుర్తించేందుకు సాంకేతికతను సైతం ఉపయోగించుకుంటున్నారు. సీసీ కెమెరాలకు కృత్రిమ మేథస్సును జోడించి జనసమర్థ ప్రాంతాల్లో మాస్కులు లేని వాళ్లను గుర్తించి జరిమానా విధిస్తున్నారు.
ఇదీ చూడండి : ఊరూరా తిరుగుతూ... అవగాహన కల్పిస్తూ...