కరోనా నిబంధనలు పాటిస్తూ హనుమాన్ జయంతి రోజు ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహిస్తామని భజరంగ్ దళ్ రాష్ట్ర అధ్యక్షుడు సుభాష్ చందర్ వెల్లడించారు. హైదరాబాద్లోని హైదర్ గూడలో మాట్లాడిన ఆయన గౌలి గూడ రామాలయం నుంచి సికింద్రాబాద్లోని తాడ్బండ్ హనుమాన్ మందిరానికి బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రతి సంవత్సరం ర్యాలీలో లక్షలాది మంది భక్తులు పాల్గొని హిందూ యువత ఐక్యతను చాటేవారని... ఈ ఏడాది చాలా తక్కువ సంఖ్యలో నిర్వహిస్తున్నట్లు సుభాష్ చందర్ పేర్కొన్నారు.
బైక్ ర్యాలీలో తీసుకోవలసిన జాగ్రత్తలపై అవసరమైన అన్ని సూచనలను కార్యకర్తలకు పంపించామని తెలిపారు. గౌలిగూడ రామమందిరంలో హోమం నిర్వహించి ర్యాలీని ప్రారంభిస్తామని ప్రకటించారు. కరోనా దృష్ట్యా ప్రతి బైక్పై ఒక కార్యకర్త మాత్రమే కూర్చునేలా ఆంక్షలు విధించామని... ప్రతి ఒక్కరూ అన్ని నియమాలు పాటించాలని స్పష్టం చేశారు.