రాష్ట్రంలో పెరుగుతున్న వ్యవసాయ పరిమాణం దృష్టిలో ఉంచుకొని యూరియా కోసం కేంద్రానికి లేఖ రాసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. పలు జిల్లాల్లో యూరియా కొరత నేపథ్యంలో వ్యవసాయ శాఖ మంత్రి స్పందించారు. ఖరీఫ్ సీజన్ కోసం 8.50 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను కేంద్రం కేటాయించగా 3.97 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం 2.12 లక్షల మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉందన్నారు. రసాయన ఎరువుల కేటాయింపు అనేది కేంద్రం పరిధిలో ఉన్నందున ఏటా ఆయా రాష్ట్రాల వాడకాన్ని బట్టి కొంత కోటా పెంచడం జరుగుతోందని పేర్కొన్నారు. ఈ పరిస్థితి ముందే ఊహించి ఈ నెల 19న కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రి నరేంద్ర సింగ్ తోమర్కు తెలంగాణ ప్రభుత్వం తరపున లేఖ రాశామని తెలిపారు. కేంద్రం వెంటనే స్పందించి తెలంగాణకు కేటాయించిన యూరియా కోటా విడుదల చేయాలని విజ్ఞప్తి చేసిన దృష్ట్యా రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి పేర్కొన్నారు.
ఇదీ చూడండి: యూరియా కేటాయించాలని కేంద్రానికి లేఖ