ప్రజల దాహార్తిని తీర్చడంతో పాటు వారికి స్వచ్చమైన, శుద్ధిచేసిన నదీజలాలను అందించాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగరీథ పథకాన్ని చేపట్టింది. తాగునీటి కోసం ప్రజలు ముఖ్యంగా గ్రామీణ ప్రాంత వాసులు, మూరుమూల ప్రజలు, ఆదివాసీ గూడేలు, లంబాడి తండాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, మంచినీరు లభించక దీర్ఘకాలిక వ్యాధులను దృష్టిలో ఉంచుకొని ఈ పథకానికి సీఎం కేసీఆర్ ప్రత్యేక రూపకల్పన చేశారు. శాసనసభ్యునిగా ఉన్నప్పుడు సిద్దిపేట నియోజకవర్గంలో ఇంటింటికీ నల్లానీరు అందించిన కేసీఆర్... అదే స్ఫూర్తితో రాష్ట్ర వ్యాప్తంగా సురక్షిత మంచినీరు అందించేందుకు మిషన్ భగీరథ పేరిట తెలంగాణ వాటర్ గ్రిడ్ పథకాన్ని చేపట్టారు.
కరీంనగర్లో పథకానికి ముందడుగు..
ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మొదటిసారిగా కరీంనగర్ జిల్లా పర్యటనకు వెళ్లిన సీఎం కేసీఆర్... అక్కడి ప్రజాప్రతినిధులతో జరిపిన సమీక్షలో వాటర్ గ్రిడ్ ప్రాజెక్టును మొట్టమొదటిసారిగా ప్రకటించారు. పాతికవేల కోట్ల రూపాయల వ్యయంతో వాటర్ గ్రిడ్ ప్రాజెక్టును చేపట్టనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ప్రవహిస్తున్న కృష్ణా, గోదావరి నదులపై అప్పటికే ఉన్న ప్రాజెక్టులు, జలాశయాల ద్వారా నీటిని తీసుకొని శుద్ధిచేసి వాటిని నల్లాల ద్వారా ఇంటింటికీ సరఫరా చేయడమే పథకం ఉద్దేశమని పేర్కొన్నారు.
30ఏళ్లకు సరిపడా తాగునీరు..
గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కొక్కరికి ప్రతి రోజుకు వంద లీటర్లు, పురపాలికల్లో 135, నగరపాలికల్లో 150 లీటర్ల రక్షిత మంచినీటిని నల్లాల ద్వారా అందించాలన్నది మిషన్ భగీరథ ప్రధాన లక్ష్యం. మొత్తం పథకంలో పదిశాతం నీటిని పారిశ్రామికరంగానికి కేటాయించారు. మరో 30 ఏళ్ల భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని 2048 వరకు 78టీఎంసీల నీరు అవసరమవుతుందని అంచనా వేశారు. కృష్ణా నుంచి 30, గోదావరి నుంచి 48 టీఎంసీలను వినియోగించాలని నిర్ణయించారు.
సుదీర్ఘ కసరత్తు చేసిన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ మిషన్ భగీరథ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. కేవలం మూడేళ్లలోనే పథకాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రాజెక్టును పూర్తి చేసి ఇంటింటికీ నల్లానీరు ఇవ్వకపోతే ఎన్నికల్లో ఓట్లు అడగబోమని కూడా శాసనసభా వేదికగా అప్పట్లో ప్రకటించారు కేసీఆర్. ఎట్టకేలకు గంగను నేలపైకి తెచ్చిన విధంగా భగీరథను పూర్తి చేసి దాని ద్వారా రాష్ట్రంలోని తాగు నీటి కష్టాలను తీర్చారు.
ఇదీ చూడండి: ఇళ్లకే కాదు పరిశ్రమలకూ భగీరథ నీళ్లు..!
ఇదీ చూడండి: ప్రశంసల వెల్లువలు.. భగీరథ నల్లా నీళ్లు..!
ఇదీ చూడండి: భగీరథ ప్రయత్నం ఫలించింది.. అగ్రభాగాన నిలిచింది..!