తెలంగాణలో 154కు చేరిన కరోనా కేసులు

author img

By

Published : Apr 3, 2020, 4:11 AM IST

Updated : Apr 3, 2020, 7:30 AM IST

154 corona positive cases in telangana

రాష్ట్రంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. గురువారం ఒక్క రోజే 27 పాజిటివ్​ కేసులు నమోదు అయ్యాయి. ఈ మహమ్మారి బారిన పడిన వారి సంఖ్య 154కిచేరింది. వీరిలో ఇప్పటికే 17మంది కోలుకుని డిశ్చార్జయ్యారు. మరో 9మంది మృతి చెందినట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. రాష్ట్రంలో కేసులు మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉంటేనే ఈ మహమ్మారిని తరిమికొట్టవచ్చని సూచిస్తోంది.

కరోనా కేసులు గత కొద్ది రోజులుగా గణనీయంగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో బుధవారం ఏకంగా 30 పాజిటివ్ కేసులు నమోదుకాగా.. అదే పరంపరను కొనసాగిస్తూ.. గురువారం 27 మందికి వైరస్​ సోకినట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఏప్రిల్ 7 నాటికి అంతా సర్దుకుంటుందని భావించిన సర్కారు ఆశలు.. నీరు గారాయి. ప్రస్తుతం రాష్ట్రంలో పాజిటివ్ వచ్చిన వారి సంఖ్య 154కు చేరగా.. వీరిలో ఇప్పటికే 17మంది కోలుకుని డిశ్చార్జయ్యారు. మరో 9మంది చనిపోయారు.

దిల్లీ మర్కజ్ వెళ్లి వచ్చిన వారే

రాష్ట్రంలో ప్రస్తుతం వైరస్​ సోకి చికిత్స పొందుతున్న రోగుల సంఖ్య 128కి చేరింది. వీరిలో అత్యధికులు దిల్లీ మర్కజ్ వెళ్లి వచ్చిన వారే అని సమాచారం. మర్కజ్ కేసులు గత నెల 28 నుంచి వెలుగుచూస్తున్నాయి. అంతకుముందు ఇండోనేషియా నుంచి వచ్చినవారు దిల్లీ నుంచే వచ్చినట్లు సమాచారం ఉన్నప్పటికీ సర్కారు పెద్దగా దృష్టి సారించలేదు. కేంద్రం ఆదేశాలతో ఎక్కువగా అంతర్జాతీయ ప్రయాణికుల వివరాలను ఆరా తీసి వారికి పరీక్షలు చేసింది.

అంతా సర్దుకుంటోందని..

గత నెల రోజుల్లో కేసులు నమోదైన తీరుని గమనిస్తే.. ఇటీవలి కాలంలో భారీగా పెరిగినట్లు స్పష్టం అవుతోంది. మార్చి 2న మొట్టమొదటి సారిగా దుబాయ్ నుంచి వచ్చిన సాఫ్ట్​వేర్​ ఉద్యోగికి వైరస్​ సోకినట్లు ప్రభుత్వం నిర్ధరించింది. అతను గత నెల 11న గాంధీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్​ అయ్యే వరకు మరొక్క కేసు కూడా వెలుగుచూడలేదు. అంతా సర్దుకుంటోందని ప్రభుత్వం భావిస్తున్న తరుణంలో.. 15,16తేదీల్లో ఒక్కో కరోనా కేసులు నమోదయ్యాయి.

ఇండోనేషియా నుంచి వచ్చిన బృందం

17న కరీంనగర్​లో ఇండోనేషియా నుంచి వచ్చిన బృంద సభ్యుల్లో ఒకరికి.. 18న మరో ఏడుగురికి, 20న మరో ఇద్దరికి పాజిటివ్ అని తేలింది. వీరంతా దిల్లీ జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నప్పటికీ ప్రభుత్వం అప్పటికి కేవలం అంతర్జాతీయ ప్రయాణికులు అయినందునే వైరస్​ సోకి ఉంటుందని భావించింది. ఆ తర్వాత వారితో తిరిగిన కరీంనగర్​కి చెందిన మరో యువకుడికి కరోనా ఉన్నట్లు తేలినా దిల్లీ నుంచి వచ్చిన వారిపై ఆరా తీయలేదు.

8 మందికి కరోనా పాజిటివ్

మార్చి 28న తొలిసారిగా రాష్ట్రంలో ఒకరు మృతి చెందారు. అయితే మృతుడు ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. ఆ తర్వాత పరీక్ష చేయగా అతనిలో పాజిటివ్ అని తేలింది. అదే రోజు 8 మందికి కరోనా సోకినట్లు తెలిసింది. ఇందులో దిల్లీ నుంచి వచ్చిన వారు ఉండటంతో అనుమానించిన సర్కారు.. దిల్లీ వెళ్లి వచ్చిన వారిపై ప్రత్యేక దృష్టి సారించింది. వారి వివరాలను సేకరించి.. లక్షణాలున్న వారిని పరీక్షించటం ప్రారంభించింది.

మార్చి 31న 15 పాజిటివ్ కేసులు

మార్చి 30న ఆరు పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఒకరు మృతి చెందినట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. అదే రోజు మరో నలుగురు మృతి చెందారని సీఎంవో తెలిపింది. మార్చి 31న మొట్టమొదటి సారిగా భారీ స్థాయిలో 15 కేసులను ప్రభుత్వం ప్రకటించింది.

Last Updated :Apr 3, 2020, 7:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.