రఘుకుల తిలకుడు శ్రీరామచంద్రుడు, రమ్య మనోహరమైన జానకీదేవి కల్యాణవేడుక... భద్రాద్రి క్షేత్రంలో వైభవోపేతంగా జరిగింది. లోకమంతా వేయికళ్లతో ఎదురుచూస్తుండగా సీతారాముల వారు ఒక్కటైన వేడుక.... అందరి మదిని ఆనందడోలికల్లో ముంచెత్తింది. వేద మంత్రోచ్చారణలు మార్మోగుతుండగా.. అభిజిత్ లగ్న ముహూర్తాన... జీలకర్ర బెల్లం మిశ్రమాన్ని సీతారాముల వారి శిరస్సుపై ఉంచారు. ముల్లోకాలు మురిసే విధంగా... మూడు ముళ్ల బంధానికి నిదర్శనంగా... మాంగళ్య ధారణ జరిగింది.
కనుల విందుగా..
శ్రీ సీతారాముల కల్యాణ క్రతువు ఆద్యంతం ఆకట్టుకుంది. సుందరంగా ముస్తాబైన బేడా మండపానికి దేవతామూర్తులను తీసుకొచ్చారు. తిరుకల్యాణానికి సంకల్పం పలికి.. సర్వవిజ్ఞాన శాంతికి ఆరాధాన నిర్వహించారు. కల్యాణానికి ఉపయోగించే సామాగ్రికి సంప్రోక్షణ చేశారు. అనంతరం రక్షాబంధనం నిర్వహించి యోక్తధారణ చేశారు. దర్బాలతో ప్రత్యేకంగా అల్లిన తాడుని సీతమ్మ నడుముకి బిగించారు. సీతారాముల వారికి రక్షబంధనం కట్టి.... స్వామి గృహస్త ధర్మం కోసం యజ్ఞ్నోపవితరణ చేశారు. తాంబూలాది, కన్యావరుణ సత్కారాలు అందించారు. శ్రీరాముడికి సీతమ్మ తగిన వధువని పెద్దలు నిర్ణయించగా.. చూర్ణికను పఠించారు.
వన్నె తెచ్చిన ముత్యాల తలంబ్రాల వేడుక..
ప్రభుత్వం తరఫున మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, పువ్వాడ అజయ్ పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. వేద మంత్రాలు మార్మోగుతుండగా.. జీలకర్ర బెల్లం మిశ్రమాన్ని సీతారాముల శిరస్సుపై ఉంచారు. శుభ ముహూర్తంగా... జగత్ కల్యాణంగా వైదిక పెద్దలు ఉదహరించారు. కల్యాణం తర్వాత జరిగిన ముత్యాల తలంబ్రాల వేడుక... సీతారాముల కల్యాణ మహోత్సవానికి మరింత వన్నెతెచ్చింది. రాముడి దోసిట పడిన తలంబ్రాలు నీలపు రాసులుకాగా..... జానకి దోసిట తలంబ్రాలు మణిమాణిక్యాలై సాక్షాత్కరించింది.
గురువారం శ్రీరాముడి పట్టాభిషేక మహోత్సవం..
ఏటా మిథిలా ప్రాంగణంలో అంగరంగ వైభవంగా సాగాల్సిన కల్యాణ వేడుక.. వరుసగా రెండో ఏడాది కూడా కరోనా విజృంభణతో అత్యంత సాదాసీదాగా నిర్వహించారు. బేడా మండపంలోనే సీతారాముల కల్యాణం జరిపారు. కరోనా ప్రభావంతోనే రాములోరి కల్యాణం నిరాడంబరంగా నిర్వహించాల్సి వచ్చిందని మంత్రులు అభిప్రాయపడ్డారు. గురువారం శ్రీరాముడి పట్టాభిషేక మహోత్సవం జరగనుంది.
ఇవీచూడండి: హనుమంతుడి జన్మస్థానం...అంజనాద్రే