గ్రామీణ ప్రాంతాల నుంచి వివిధ పనుల నిమిత్తం నిత్యం పట్టణాలకు రాకపోకలు సాగించడం, పల్లెల్లో జనం ఇంకా పూర్తిస్థాయిలో అప్రమత్తం కాకపోవడం, అధికారుల పర్యవేక్షణ లోపం వెరసి.. గ్రామాల్లోనూ కరోనా విజృంభిస్తోంది. ముఖ్యంగా గ్రామాల్లో గుంపులు గుంపులుగా జన సంచారం, వైరస్ను లెక్కచేయకుండా శుభకార్యాలు నిర్వహిస్తుండటం, వేడుకల్లో కనీస జాగ్రత్తలు పాటించకపోతుండటం వల్ల పరిస్థితులు ఆందోళనకరంగా మారుతున్నాయి.
ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో వైరస్ విజృంభణ మొదలైన తొలినాళ్లలో గ్రామీణ ప్రాంతాల్లో అడపా దడపా మాత్రమే పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కానీ ఇటీవలి కాలంలో గ్రామాల్లో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. పూర్వ ఖమ్మం జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు నెల రోజుల నుంచి కేసుల తీవ్రత అంతకంతకూ ఎక్కువవుతోంది.
ముఖ్యంగా గ్రామాల్లో ఏ చిన్న అవసరం వచ్చినా.. పట్టణాల మీద ఆధారపడాల్సిందే. నిత్యావసరాలు మొదలుకొని ప్రతి పనికి జనం నిత్యం పట్టణాలు, నగరాలకు రాకపోకలు సాగిస్తుంటారు. ఇలా వైరస్ పట్టణాల నుంచి గ్రామాలకు వ్యాప్తి చెందుతోంది. మరోవైపు చిన్న చిన్న అనారోగ్యాలకు జనం ఆసుపత్రుల బాట పడుతున్నారు. ఏ చిన్న ఆరోగ్య సమస్య తలెత్తినా.. ఆ మహమ్మారే అయి ఉంటుందని పరీక్షలు చేయించుకుంటున్నారు. ఈ క్రమంలోనే చాలా మంది వైరస్ బారినపడుతున్నారు.
పల్లెల్లో కొవిడ్ నిబంధనల అమలెక్కడ?
వైరస్ వ్యాప్తి మొదలైన రోజుల్లో గ్రామాల్లో ప్రజలంతా చైతన్యంతో ఉన్నారు. సమీపంలోని పట్టణాల్లో కరోనా కేసులు నమోదవుతుంటే.. గ్రామస్థులంతా ఐక్యమై నిలబడ్డారు. తమ గ్రామాలకు ఎవరూ రావొద్దంటూ ఆంక్షలు విధించుకున్నారు. సరిహద్దుల్లో ముళ్లకంచెలు వేసుకున్నారు. ఊళ్లోకి వైరస్ వ్యాపిస్తుందన్న భయంతో అంతా స్వీయ నియంత్రణ పాటించారు. కానీ వైరస్ వ్యాప్తి ఉద్ధృతమైన తర్వాత మాత్రం జాగ్రత్తలపై నిర్లక్ష్యం వహిస్తున్నారు. కరోనా బారినపడిన బాధితులు పూర్తి స్థాయిలో హోం ఐసోలేషన్ పాటించకపోవడం, వైరస్ లక్షణాలు ఉన్న వాళ్లు బయట తిరగడం వైరస్ ఉద్ధృతికి ప్రధాన కారణం అవుతోంది.
నియంత్రణ లేకపోతే మరింత ప్రమాదం..
ఓ వైపు గ్రామీణ ప్రాంతాల్లో కరోనా పాగా వేస్తున్నప్పటికీ.. కొవిడ్ నిబంధనలు మాత్రం పూర్తిస్థాయిలో అమలుకావడం లేదు. ముఖ్యంగా గుంపులు, గుంపుల జన సంచారం గ్రామాల్లో కొనసాగుతూనే ఉంది. శుభకార్యాలూ అడపా దడపా జరుగుతూనే ఉన్నాయి. వేడుకలకు వందల సంఖ్యలో జనం హాజరవుతూ.. కనీస జాగ్రత్తలను తుంగలో తొక్కుతున్నారు. శుభకార్యాలు, అంత్యక్రియలకు పరిమిత సంఖ్యలో మాత్రమే జనం హాజరుకావాలి. ఇందుకోసం ప్రత్యేకంగా రెవెన్యూ, పోలీస్ అధికారుల అనుమతి తీసుకోవాలని నిబంధనలు ఉన్నా.. అవి ఎక్కడా అమలుకావడం లేదు.
గ్రామాల్లో ఈ పరిస్థితులు మారాలంటే.. అధికారుల మధ్య సమన్వయం అవసరం. పోలీస్, వైద్య శాఖలతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు కొవిడ్ నియంత్రణకు నడుం బిగించాలి. ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూనే.. వారికి తగిన సలహాలు, సూచనలు ఇవ్వాలి. ఇలా జరిగితే గానీ గ్రామాల్లో వైరస్ వ్యాప్తిని కట్టడి చేయలేము.
మండలాల వారీగా పాజిటివ్ కేసుల సంఖ్య
- ఖమ్మం జిల్లా
కూసుమంచి 49, నేలకొండపల్లి 20, తిరుమలాయపాలెం 11, ఖమ్మం గ్రామీణం 60, కొణిజర్ల 31, ఏన్కూరు 06, కారేపల్లి 15, ఎర్రుపాలెం 28, చింతకాని 08, బోనకల్ 30, ముదిగొండ 18, పెనుబల్లి 06, కల్లూరు 40, వేంసూరు 04, తల్లాడ 22, కామేపల్లి 07
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
జూలూరుపాడు 10, సుజాతనగర్ 39, చుంచుపల్లి 62, లక్ష్మీదేవిపల్లి 72, భద్రాచలం 110, చర్ల 11, దుమ్ముగూడెం 05, అశ్వాపురం 28, పినపాక 20, కరకగూడెం 10, బూర్గంపాడు 42, గుండాల 14, టేకులపల్లి 27, ఆళ్లపల్లి 01, అశ్వారావుపేట 20, దమ్మపేట 07, ముల్కల్లపల్లి 05, అన్నపురెడ్డిపల్లి 04, చంద్రుగొండ 10.
ఇదీ చదవండి: 'కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమష్ఠి కృషితో మెరుగైన వైద్యం సాధ్యం'