"టోక్యో ఒలింపిక్స్లో భారత్ రెండంకెల సంఖ్యలో పతకాలు సాధించడం ఖాయం"- కేంద్ర క్రీడల మంత్రి మొదలుకుని దేశంలో పేరున్న మాజీ క్రీడాకారులు, కోచ్లు చెప్పిన మాట ఇది. ఒలింపిక్స్కు ముందు షూటర్ల ప్రతిభ, ఆర్చర్ల పతకాల పంట, వెయిట్ లిఫ్టర్ల ప్రదర్శన, బాక్సర్ల పంచ్ల హోరు చూసి డబుల్ డిజిట్ ఖాయమే అనుకున్నారంతా! ఒలింపిక్స్లో పోటీలు ప్రారంభమైన తొలిరోజే మీరాబాయి చాను రజత పతకం గెలవగానే అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. కానీ మళ్లీ అదే కథ! వరుసగా షూటర్లు, ఆర్చర్లు విఫలం కాగా.. రెండో పతకం కోసం వారం రోజులకు పైగా ఎదురు చూపులు తప్పలేదు. హాకీలో భారత జట్ల మెరుపులు.. చివరి పోటీల్లో నీరజ్ చోప్డా, భజరంగ్ల పతకాలు లేకపోయుంటే భారత్ పరిస్థితి దయనీయంగా ఉండేదే! ప్రపంచ పటంలో సరిగ్గా కనిపించని దేశాలు స్వర్ణాలు సాధిస్తూ, పట్టికలో ముందు వరుసలో ఉంటుంటే.. ఒక్క బంగారు పతకం కోసం 130 కోట్ల భారతావని కళ్లు కాయలు కాచేలా ఎదురు చూసే పరిస్థితి రావడమేంటి? ఆర్థికంగా ఏమాత్రం సరితూగలేని.. పేదరికంలో మగ్గుతున్న ఎన్నో దేశాలు పతకాల పట్టికలో భారత్ కంటే మెరుగైన స్థానాల్లో ఉండటానికి కారణమేంటి? లోపం ఎక్కడుంది? పరిష్కారం ఎవరి చేతుల్లో ఉంది?
అక్కడ అలా..
టోక్యో ఒలింపిక్స్లో స్వర్ణం సాధించిన నీరజ్ చోప్డాకు హరియాణా రూ.6 కోట్లు, పంజాబ్ రూ.2 కోట్లు నజరానాగా ప్రకటించాయి. మరింతగా అతడి కాసుల వర్షం కురుస్తోంది. మరి పతకాల పట్టికలో అగ్రస్థానాల్లో ఉన్న దేశాలు విజేతలకు ఇచ్చే నగదు బహుమతులు చూస్తే ఆశ్చర్యం కలగకమానదు. ఒలింపిక్స్లో స్వర్ణానికి ఆస్ట్రేలియా రూ.11 లక్షలు, అమెరికా రూ.28 లక్షలు, జపాన్ రూ.34 లక్షలు, రష్యా రూ.45 లక్షలు నజరానాగా ఇస్తాయి. మరి అంత తక్కువగా నగదు బహుమతులు ఇస్తున్నా.. ఆ క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పతకాలెలా గెలుస్తున్నారు? భారత్లో పతకాలు ఎందుకు రావట్లేదు? అన్న ప్రశ్నలకు సమాధానం ఒక్కటే.. మనం పతకం వచ్చాక డబ్బులు ఇస్తున్నాం. మిగతా దేశాలు పతకం కోసం డబ్బులు ఖర్చు చేస్తున్నాయి! అమెరికా, ఇంగ్లాండ్, రష్యా, చైనా, జపాన్ సహా అగ్రదేశాల్లో క్రీడాకారులకు 8ఏళ్ల వయసున్నప్పటి నుంచి ఒలింపిక్స్లో పతకాలు సాధించే వరకు ఖర్చంతా ప్రభుత్వాలదే. మౌలిక వసతులు, ఆహారం, టోర్నీలు, శిక్షణ పూర్తిగా ప్రభుత్వం చేతుల్లోనే. రష్యా, చైనా లాంటి కమ్యూనిస్టు దేశాల్లో స్పోర్ట్స్ స్కూళ్లే ఒలింపిక్స్ కార్ఖానాలు. చిన్న వయసులోనే పిల్లల్ని స్పోర్ట్స్ స్కూల్కు తీసుకెళ్లి రెండేళ్ల వరకు అన్ని రకాల క్రీడలు ఆడిస్తారు. ఎత్తు, బరువు, వేగం, నైపుణ్యం ప్రకారం వారికి సరిపడే క్రీడలకు ఎంపిక చేస్తారు. అమెరికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీలు, కమ్యూనిటీ సెంటర్లు సహా ఎక్కడికి వెళ్లినా అత్యుత్తమ మౌలిక వసతులు అందుబాటులో ఉంటాయి. ప్రతి చోటా మంచి కోచ్లు ఉంటారు. కళాశాలలు క్రీడాకారులకు ఉపకార వేతనాలు ఇస్తాయి. టోర్నీల నిర్వహణ పారదర్శకంగా సాగుతుంది. ఒలింపిక్ ప్రమాణాలను అందుకోగల క్రీడాకారుల గురింటి ఇట్టే తెలిసిపోతుంది. వెంటనే వారిని ఒలింపిక్స్ ప్రాబబుల్స్లో చేర్చి మరింత మెరుగైన శిక్షణ ఇస్తారు.
ఇక్కడ ఇలా..
"అంతర్ జిల్లా టోర్నీ నిర్వహించాలంటే ప్రభుత్వం నిధులు ఇవ్వదు. అక్కడా.. ఇక్కడా రూ.3- 4 లక్షలు సేకరించి టోర్నీ నిర్వహిస్తే శిక్షణ శిబిరానికి స్టేడియాన్ని ఉచితంగా ఇవ్వరు. గదులు కేటాయించరు. పిల్లలకు ఆహారం, ఇతరత్రా ఖర్చులు సొంతంగా పెట్టుకోవాలి. జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన క్రీడాకారులకు టీఏ, డీఏలు కూడా ఇవ్వరు. కోచ్లను నియమించరు. ఉన్నవాళ్లను క్రమబద్దీకరించరు. కానీ ఒలింపిక్స్లో పతకాలు కావాలి".. తెలంగాణ హాకీ సంఘం కార్యదర్శి ముకేశ్కుమార్ ఆవేదన ఇది. మూడు ఒలింపిక్స్లలో దేశానికి ప్రాతినిధ్యం వహించి.. హాకీ క్రీడాకారుల్ని తయారు చేయాలన్న మంచి ఉద్దేశంతో సంఘంలో అడుగుపెట్టిన ముకేశ్కు ఎదురవుతున్న అనుభవం ఇది. దేశంలో.. అన్ని రాష్ట్రాల్లోనూ దాదాపుగా ఇలాంటి పరిస్థితే! ప్రభుత్వాలు నిధులు ఇవ్వవు. సంఘాలు నడిపించే వారి దగ్గర డబ్బులు ఉండవు. శిక్షణ, టోర్నీలు, ప్రతిభాన్వేషణ వ్యవస్థలే సరిగా లేనప్పుడు ఒలింపియన్లు ఎక్కడ్నుంచి వస్తారు? తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాల ఆధ్వర్యంలో నడిచే స్పోర్ట్స్ స్కూళ్లు, అకాడమీలు ఉన్నాయి. స్పోర్ట్స్ స్కూళ్లు, అకాడమీల నుంచి ఎంతమంది అంతర్జాతీయ క్రీడాకారులు తయారవుతున్నారంటే చెప్పలేని పరిస్థితి. స్పోర్ట్స్ స్కూళ్లు, అకాడమీల్లో ప్రవేశాల కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు సిఫారసు లేఖలిస్తున్నారు. ప్రతిభతో కాకుండా ఇలా ప్రవేశాలు దక్కించుకున్న వారి నుంచి ఎలాంటి ప్రదర్శన ఆశిస్తాం? ఏ కళాశాలలో చేరితే ఎంసెట్ ర్యాంకు వస్తుంది.. ఎక్కడ ఉన్నత విద్య అభ్యసిస్తే జీవితంలో బాగా స్థిరపడొచ్చు.. లాంటి ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి. కానీ ఏ క్రీడ బాగుంటుంది.. ఏ అకాడమీలో చేర్చితే నాణ్యమైన శిక్షణ లభిస్తుంది.. ఏ కోచ్ దగ్గరకు పంపిస్తే పిల్లలు ఉన్నత స్థితికి చేరుకుంటారు అన్న ప్రశ్నలకు సరైన సమాధానాలు లభించవు.
మరి ఎలా..?
లక్షల్లో జీతాలు తీసుకుంటున్న భారత క్రీడాప్రాధికార సంస్థ (సాయ్) శిక్షకులు, అన్ని రాష్ట్రాల కోచ్లు దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో ఉన్నారు. ప్రతి రాష్ట్రంలో సాయ్ కేంద్రాలు, స్థానిక ప్రభుత్వాల ఆధ్వర్యంలో నడిచే అకాడమీలు, స్పోర్ట్స్ స్కూళ్లు ఉన్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం పటియాలా, బెంగళూరు కేంద్రాలపైనే దృష్టిసారిస్తుంది. అక్కడి క్రీడాకారులకే వసతులు, నిధులు అందజేస్తుంది. ఇంత పెద్ద దేశంలో ఈ రెండు కేంద్రాలు ఎంతమంది ఒలింపియన్లను తయారు చేయగలవు? కోచ్లలో జవాబుదారీతనం పెంచి.. రాష్ట్రాల్లోని సాయ్ కేంద్రాలు, అకాడమీల్ని బలోపేతం చేసి మెరుగైన మౌలిక వసతులు, నాణ్యమైన శిక్షణ అందిస్తే ఫలితాలు సాధ్యం. సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ విభాగాల్లో జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో నిర్వహించే టోర్నీలకు నిధులు సమకూర్చడం.. పతకాలు సాధించిన క్రీడాకారులకు ఆర్థిక ప్రోత్సాహాలు అందిస్తే దేశంలో క్రీడా సంస్కృతి పెరగడం ఖాయం. ఇందుకు మన క్రికెట్ వ్యవస్థే నిదర్శనం. ప్రపంచ క్రికెట్లో భారత్ శక్తిగా ఎదగడానికి దేశవాళీ క్రికెట్ నిర్మాణమే కారణం. అండర్-14 నుంచి మొదలుపెడితే.. అండర్-16, 19, 22, రంజీ ట్రోఫీ, విజయ్ హజారే, ముస్తాక్ అలీ, దులీప్ ట్రోఫీ, ఐపీఎల్, ఇండియా-ఎ, టీమ్ఇండియా వరకు పటిష్టమైన వ్యవస్థ ఉంది. దేశంలో ఎక్కడ లీగ్ మ్యాచ్లు జరిగినా ప్రతిభావంతుల్ని గుర్తించే అవకాశముంది. దేశంలో, రాష్ట్రంలో జరిగే ప్రతి క్రికెట్ టోర్నీ లేదా లీగ్లకు బీసీసీఐ నిధులు సమకూరుస్తుంది. అండర్-14 మొదలుకుని ప్రతి వయోపరిమితి విభాగంలో బరిలో దిగే క్రికెటర్లకు మ్యాచ్ ఫీజు, టీఏ, డీఏ, ఉచిత భోజన.. వసతితో సహా అన్ని సదుపాయాలు అందిస్తుంది. మిగతా క్రీడల్లోనూ ఇలాంటి వ్యవస్థను ఏర్పాటు చేస్తే మెరుగైన ఫలితాలు సాధ్యం. ప్రభుత్వం టోర్నీల నిర్వహణకు నిధులు ఇస్తూ.. పతకాలు సాధించే అన్ని వయో పరిమితుల క్రీడాకారులకు ఆర్థిక ప్రోత్సాహకాలు సక్రమంగా అందిస్తే ప్రపంచ క్రీడారంగంలో భారత్ తిరుగులేని శక్తిగా ఎదగొచ్చు.
ఇదీ చూడండి:- ఇలా అయితే ఎక్కువ పతకాలు ఎలా వస్తాయి?