ఈ ఏడాది జూన్లో జరగాల్సిన ఆసియా కప్ రద్దయింది. ఈ విషయాన్ని శ్రీలంక క్రికెట్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి బుధవారం వెల్లడించారు. అయితే వచ్చే ఏడాది ఆసియా కప్, పాకిస్థాన్లో జరగనున్నట్లు తెలుస్తోంది.
షెడ్యూల్ ప్రకారం గత సంవత్సరం పాకిస్థాన్లోనే ఆసియా కప్ జరగాల్సి ఉంది. అయితే టీమ్ఇండియా బృందం అక్కడికి వెళ్లే అవకాశం లేకపోవడం, కరోనా కేసులు పెరగడం వల్ల ఏడాది వాయిదా పడింది. దీంతో ఈసారి శ్రీలంకలో నిర్వహించాలని భావించారు. ఇప్పుడు కూడా కరోనా ప్రభావంతో ఏకంగా రద్దయింది. దీంతో వచ్చే ఏడాది టోర్నీని తమ దేశంలో జరపాలని పాక్ ప్రయత్నాలు చేస్తోంది. ఇదే జరిగితే భారత జట్టు, దాయాది దేశానికి వెళ్తుందా అనేది ఇప్పుడు అందరికీ వస్తున్న ప్రశ్న.
ప్రస్తుతం ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ ఆడేందుకు సిద్ధమవుతోంది కోహ్లీసేన. త్వరలో ఇంగ్లాండ్ వెళ్లనుంది. జూన్ 18న సౌతాంప్టన్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.
ఇది చదవండి: కరోనా ఎఫెక్ట్- ఆసియా కప్ రద్దు