షార్ట్ బాల్స్తో ఔట్ చేయాలని భావిస్తున్న ఆస్ట్రేలియా ప్రణాళిక తనకి లాభమని టీమ్ఇండియా యువ బ్యాట్స్మన్ శ్రేయస్ అయ్యర్ అన్నాడు. ఫీల్డర్లను దగ్గరగా ఉంచి సంధించే బౌన్సర్లకు ఎదురుదాడికి దిగితే పరుగులు సాధించవచ్చని పేర్కొన్నాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్లో శ్రేయస్ 40 పరుగులే చేశాడు. తొలి వన్డేలో పేలవమైన షాట్ ఆడి రెండు పరుగులకే పెవిలియన్ చేరగా, రెండో మ్యాచ్లో స్మిత్ అద్భుతమైన క్యాచ్ అందుకోవడంతో వెనుదిరిగాడు.
"నా కోసం వ్యూహాలతో బరిలోకి దిగుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. అయితే వారి ప్రణాళికలను సవాలుగా తీసుకుంటున్నా. ఒత్తిడిలో మరింత ప్రేరణతో గొప్పగా ఆడటానికి ప్రయత్నిస్తా. షార్ట్ లెగ్, లీగ్ గల్లీలో ఫీల్డర్లు ఉండటం ఎక్కువ పరుగులు సాధించడానికి వీలు ఉంటుంది. క్రీజులోకి వచ్చిన తర్వాత మొదట కుదురుకోవడానికి ప్రయత్నిస్తా. అయితే షార్ట్బాల్స్ వేస్తే దూకుడుగా ఆడాలనుకుంటా. ఎందుకంటే ఆ సమయంలో ఉన్న ఫీల్డింగ్ షాట్లకు అనుకూలంగా ఉంటుంది"
- శ్రేయస్ అయ్యర్
తొలి మ్యాచ్లో హేజిల్వుడ్ వేసిన బౌన్సర్ను పేలవమైన షాట్ ఆడి ఔటవ్వడంపై శ్రేయస్ స్పందించాడు. "నాకు షార్ట్బాల్ వేస్తారని తెలుసు. అయితే ఆ సమయంలో నా మదిలో రెండు రకాల ఆలోచనలు ఉన్నాయి. పుల్ షాట్ లేదా అప్పర్ కట్ ఆడాలనుకున్నా. కానీ వాటిలో ఓ షాట్ను ఎంచుకునే సరికి ఆలస్యమైంది. దీంతో సమర్థవంతంగా ఆడలేకపోయా" అని అన్నాడు. సిడ్నీ పిచ్తో పోలిస్తే ప్రాక్టీస్ చేసిన పిచ్ల బౌన్స్ వేరుగా ఉండటంతో పరిస్థితులకు అలవాటు పడటానికి సమయం పట్టిందని శ్రేయస్ తెలిపాడు. అంతేగాక గత రెండు నెలలు ఐపీఎల్ ఆడటంతో టీ20 ఫార్మాట్ నుంచి వన్డేలకు తగ్గట్లుగా మారడానికి కాస్త ఇబ్బందులు తలెత్తాయని అన్నాడు. అయితే తర్వాతి మ్యాచ్లో బలంగా పుంజుకుని బరిలోకి దిగుతామని చెప్పాడు.
మూడు వన్డేల సిరీస్లో భాగంగా కాన్బెర్రా వేదికగా ఆస్ట్రేలియాతో టీమ్ఇండియా చివరి వన్డే బుధవారం ఆడనుంది.
ఇదీ చూడండి: టీమ్ఇండియా గెలవాలంటే మార్పులు అనివార్యమా?