ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్మన్ స్టీవ్ స్మిత్కు బోల్తా కొట్టించాలంటే ఐదో స్టంప్ లైన్ మీదుగా బంతులను సంధించాలని భారత బౌలర్లకు సూచించాడు దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందుల్కర్. అతడి బ్యాటింగ్ టెక్నిక్ అసాధారణమని అన్నాడు.
"సాధారణంగా టెస్టుల్లో బౌలర్కు ఆఫ్ స్టంప్ మీదగా లేదా నాలుగో స్టంప్ లైన్కు బంతులు వేయాలని సూచిస్తాం. కానీ స్మిత్కు అసాధారణమైన టెక్నిక్ సొంతం. అతడు బంతిని వేయకుముందే తన స్థానం నుంచి అయిదు అంచుల దూరం అవతలకు కదిలి బ్యాటింగ్ చేస్తాడు. అప్పుడు నాలుగు, అయిదు స్టంప్ల మధ్య బంతుల్ని సంధించి అతడిని కట్టడిచేయాలి. ఇది మానసిక సర్దుబాటు మాత్రమే. కాగా, షార్ట్ బాల్స్ను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని స్మిత్ ఇటీవల చెప్పాడు. అతడు బౌలర్ల నుంచి దూకుడు ఆశిస్తున్నాడు. కాబట్టి అతడిని ఆఫ్ స్టంప్ వైపు ఆడించేలా చేయాలి. ఎక్కువగా బ్యాక్ ఫుట్తో ఆడే విధంగా బంతులు వేసి అతడితో తప్పులు చేయించాలి."
-సచిన్, భారత దిగ్గజ క్రికెటర్.
"భారత్కు అత్యుత్తమ బౌలింగ్ దళం ఉంది. టెస్టు మ్యాచ్ల్లో విజయం సాధించాలంటే 20 వికెట్లు సాధించాలి. అయితే వాటి కోసం తీవ్రంగా శ్రమించొద్దు. ఎటాకింగ్ బౌలర్లతో పాటు డిఫెన్సివ్ బౌలర్ కావాలి. బౌలింగ్కు అనుకూలించని పిచ్లపై కూడా అతడు సత్తాచాటాలి. అంతేగాక మెయిడిన్ ఓవర్లు వేస్తూ ప్రత్యర్థులపై ఒత్తిడి పెంచాలి" అని సచిన్ అన్నాడు.
డిసెంబర్ 17న ప్రారంభం కానున్న డే/నైట్ గురించి మాట్లాడుతూ... "తొలి సెషన్లోనే పరుగులు ఎక్కువగా సాధించడానికి ప్రయత్నించాలి. అలాగే సాయంత్రం సీమ్కు అనుకూలిస్తుంది. అప్పుడు బౌలింగ్ చేయడానికి అవకాశాలు సృష్టించుకోవాలి. ఆ సమయంలో ఎనిమిది వికెట్లు కోల్పోతే పరుగులు కోసం ఆలోచించకుండా డిక్లేర్ చేయాలి. దీంతో సంధ్య కాలంలో బ్యాటింగ్కు వచ్చే ప్రత్యర్థి జట్టుపై త్వరగా వికెట్లు సాధించవచ్చు" అని సచిన్ పేర్కొన్నాడు.
ఓపెనింగ్ స్థానాల గురించి మాట్లాడుతూ మయాంక్ అగర్వాల్కు అవకాశం ఇవ్వాలని సచిన్ అభిప్రాయపడ్డాడు. "మయాంక్ను ఓపెనర్గా తీసుకోవాలి. అతడు భారీ స్కోరులు సాధించాడు. అలాగే రోహిత్ ఫిట్నెస్ సాధిస్తే అతడితో కలిసి క్రీజులోకి రావాలి. పృథ్వీ షా, కేఎల్ రాహుల్ గురించి జట్టు యాజమాన్యం నిర్ణయం తీసుకోవాలి. ఫామ్లో ఉన్న వారికి అవకాశం ఇవ్వాలి. ఇక కోహ్లీ చివరి మూడు టెస్టులకు దూరమవ్వడం తీరని లోటు. అయితే మనకి రిజర్వ్ బెంచ్ బలంగా ఉంది. విరాట్ గైర్హాజరీతో సత్తాచాటుకోవాడానికి ఇతరులకు అవకాశం లభిస్తుంది. కోహ్లీతో పాటు పుజారా జట్టులో అత్యంత కీలకం" అని సచిన్ వెల్లడించాడు. నవంబర్ 27 నుంచి ప్రారంభం కానున్న ఆస్ట్రేలియా సుదీర్ఘ పర్యటనలో భారత్ మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టులు ఆడనుంది.
ఇదీ చూడండి : ఐపీఎల్: ఐదుగురు ఉండాల్సిందే.. ఫ్రాంఛైజీల డిమాండ్