రాజస్థాన్ రాయల్స్ సారథిగా ఎంపికవ్వడం అదృష్టమని యువ క్రికెటర్ సంజు శాంసన్ అన్నాడు. విషయం ప్రకటించిన వెంటనే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ఎంఎస్ ధోనీ తనకు సందేశాలు పంపించారని తెలిపాడు. వారు అభినందనలు తెలపడంతో ఆనందం పట్టలేకపోయానని వెల్లడించాడు. క్రికెట్ దిగ్గజం సంగక్కరతో కలిసి పనిచేయడం కన్నా ఇంకేం కావాలని అంటున్నాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ అరంగేట్రం విజేత రాజస్థాన్ రాయల్స్. తొలి ట్రోఫీ అందుకున్న ఆ జట్టుకు మళ్లీ అదృష్టం కలిసిరాలేదు. రెండేళ్లు నిషేధానికీ గురైంది. ఎంతోమంది విదేశీ, స్వదేశీ సీనియర్లను ప్రయత్నించినా టైటిల్ కొట్టలేకపోయారు. ఈ సీజన్ వేలానికి ముందు స్టీవ్స్మిత్ను వదిలేసిన రాజస్థాన్ సంజు శాంసన్ తమ కెప్టెన్ అని ప్రకటించి సంచలనం సృష్టించింది. అతడిపై భారీ ఆశలే పెట్టుకొంది. క్రికెట్ డైరెక్టర్గా సంగక్కర్ను నియమించుకుంది.
"ఈ సంగతి బయటకు చెప్పకుండా ఉండలేను. విరాట్ భాయ్, రోహిత్ భాయ్, ధోనీ భాయ్ నుంచి నాకు అభినందనల సందేశాలు వచ్చాయి. దాంతో ఉబ్బితబ్బిబ్బయ్యాను. ఇక సంగా ఒక దిగ్గజం. కేవలం క్రికెట్ పరంగానే కాదు. ఆయన చాలా మంచి మనిషి. ఆయనతో మాట్లాడటం నాలోని ఒత్తిడిని పూర్తిగా దూరం చేసింది. తొలిసారి మాట్లాడగానే ఆయన నాతో ఉండటం అదృష్టంగా అనిపించింది. నేనెక్కడి నుంచి వచ్చాను, టీమ్ఇండియా ఆడేటప్పుడు నా అనుభూతులు, ఈ వయసులో ఐపీఎల్లో జట్టును నడిపించడం గురించి మొత్తం ఆయనకు తెలుసు. ప్రస్తుత నా పాత్ర (కెప్టెన్)కు ఆయన భాగస్వామిగా దొరకడం గర్వంగా ఉంది"
-సంజు శాంసన్
ఇదీ చదవండి:ధోనీ పాఠాలతో ధోనీపైనే పోరు!