ఆస్ట్రేలియాతో జరగబోయే చివరి మూడు టెస్టులకు తాత్కాలిక సారథిగా పగ్గాలు చేపట్టబోతున్న అజింక్యా రహానెను ప్రశంసించాడు టీమ్ఇండియా పేసర్ ఇషాంత్ శర్మ. అతడి ప్రశాంత స్వభావం, ఆటగాళ్లతో కమ్యూనికేట్ అయ్యే విధానం.. ఓ కెప్టెన్గా తాను జట్టును సమర్థవంతంగా ముందుకు నడిపించడానికి దోహదపడతాయని చెప్పాడు. అతడి వద్ద నాయకత్వ లక్షణాలు బాగా ఉన్నాయని కితాబిచ్చాడు. కాగా, గాయంతో ఆసీస్ పర్యటనకు దూరమయ్యాడు ఇషాంత్.
"రహానె చాలా ప్రశాంతంగా, ఆత్మవిశ్వాసంతో ఉంటాడు. అతడు బౌలర్ల సారథి. కోహ్లీ లేని సమయంలో మేమిద్దరం కలిసి ఆడినప్పుడు, 'నీకు ఎలాంటి ఫీల్డింగ్ కావాలి? బౌలింగ్ ఎప్పుడు చేయాలనుకుంటున్నావు? నీకు బౌలింగ్ చేయాలని ఉందా?' అని నన్ను అడిగేవాడు. అతనిది ఆదేశించే వ్యక్తిత్వం కాదు. జట్టు నుంచి తనకు ఏమి కావాలో ఓ స్పష్టత ఉంటుంది. తన వ్యక్తిత్వాన్ని అతడి కెప్టెన్సీలో మనం చూడొచ్చు. చుట్టూ ఉన్న ఆటగాళ్లతో చాలా సరదాగా ఉంటాడు. కఠిన పరిస్థితుల్లోనూ అందరిలో ధైర్యాన్ని, స్ఫూర్తిని నింపగలడు. బౌలర్లతో బాగా కమ్యూనికేట్ అవుతాడు. దీంతో వారు కూడా ఇబ్బందికి లోనవ్వరు."
-ఇషాంత్ శర్మ, టీమ్ఇండియా ఫాస్ట్ బౌలర్.
డిసెంబరు 26న ప్రారంభం కానున్న(బాక్సింగ్ డే) రెండో టెస్టులో ఆసీస్-భారత్ తలపడనున్నాయి. ప్రస్తుతం ఈ సిరీస్లో ఆసీస్ 1-0తో ఆధిక్యంలో ఉంది.
ఇదీ చూడండి : కోహ్లీ, రహానె కెప్టెన్సీకి అదే తేడా: సచిన్