ఏకంగా ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీనే వాయిదా పడిపోయింది. దాని ముందు చాలా చిన్నదైన ఐపీఎల్ గురించి ఇంకేం చెప్పాలి? లీగ్ను ఇప్పటికే మార్చి 29 నుంచి ఏప్రిల్ 15కు వాయిదా వేయగా.. దేశవ్యాప్తంగా మూడు వారాల పాటు లాక్డౌన్ విధిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వచ్చే నెలలోనూ ఐపీఎల్ మొదలయ్యే అవకాశాలు దాదాపు లేవని స్పష్టమైపోయింది. ఐపీఎల్ భవితవ్యంపై చర్చించేందుకు మంగళవారం ఫ్రాంఛైజీల యజమానులతో బీసీసీఐ అధికారులు కాన్ఫరెన్స్ కాల్ నిర్వహించాల్సి ఉండగా.. అకారణంగా దాన్ని రద్దు చేశారు. కరోనా వైరస్ ప్రభావం రోజు రోజుకూ పెరుగుతుండటం, ఇప్పుడిప్పుడే పరిస్థితులు మెరుగుపడేలా లేనందున వచ్చే రెండు నెలల్లో ఐపీఎల్ నిర్వహణ దాదాపు అసాధ్యంగా కనిపిస్తోంది.
రద్దా.. ద్వితీయార్థంలోనా?
జులై- ఆగస్టుల్లో జరగాల్సిన ఒలింపిక్సే వచ్చే ఏడాదికి వాయిదా పడ్డ నేపథ్యంలో ఈ ఏడాదికి ఐపీఎల్ను పూర్తిగా రద్దు చేయడం, లేదంటే పరిస్థితులు మెరుగయ్యాక ఏడాది ద్వితీయార్ధంలో లీగ్ను నిర్వహించడం.. ఇవే బీసీసీఐ ముందున్న మార్గాలు. దీనిపై ఇక నిర్ణయం వెలువడటమే తరువాయి అని తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితులపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ మాట్లాడుతూ.. 'ఐపీఎల్ గురించి ఇప్పుడేమీ మాట్లాడలేను. లీగ్ను వాయిదా వేసిన రోజు ఏ స్థితిలో ఉన్నామో ఇప్పుడూ అలాగే ఉన్నాం. గత పది రోజుల్లో ఏమీ మారలేదు. ఐపీఎల్ భవితవ్యంపై నా దగ్గర ఏ సమాధానం లేదు. యథాతథస్థితి కొనసాగుతుంది' అని చెప్పాడు.
ఇదీ చదవండి: నా నగరాన్ని ఇలా చూస్తా అనుకోలేదు: గంగూలీ