భారత్-ఆస్ట్రేలియా మధ్య డే/నైట్ టెస్టు కోసం ఎదురుచూస్తోన్న అభిమానులకు శుభవార్త. త్వరలోనే మీ కోరిక నెరవేరనుంది. ఈ ఏడాది చివర్లో ఆసీస్ గడ్డపై టీమిండియా పింక్ బాల్ టెస్టు ఆడనుంది. దీనిపై స్పష్టతనిచ్చాడు బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ. దీంతో పాటు మరో బంపర్ వార్తను క్రికెట్ అభిమానులకు వినిపించాడు దాదా. ఇంగ్లాండ్తోనూ ఓ డే/నైట్ టెస్టు ఉంటుందని తెలిపాడు.
"అవును. ఆస్ట్రేలియాలో టీమిండియా డే/నైట్ టెస్టు ఆడుతుంది. త్వరలోనే అధికారిక ప్రకటన చేస్తాం. భారత్లో ఇంగ్లాండ్తో జరిగే టెస్టు సిరీస్లో రెండో మ్యాచ్ డే/నైట్ మ్యాచ్గా నిర్వహిస్తాం. ఇకనుంచి ప్రతి సిరీస్లోనూ ఓ డే/నైట్ టెస్టు ఉండేలా చూస్తాం."
-సౌరభ్ గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు
2018-19 ఆస్ట్రేలియా పర్యటనలో అనుభవం లేని కారణంగా పింక్ బాల్ టెస్టుకు నో చెప్పింది బీసీసీఐ. కానీ ఇటీవల ఆసీస్తో వన్డే సిరీస్ ప్రారంభంలో ఈ విషయంపై ఓ స్పష్టత ఇచ్చాడు టీమిండియా సారథి కోహ్లీ. ఆస్ట్రేలియాలో డే/నైట్ టెస్టు ఆడతామని తెలిపాడు.
"ఛాలెంజ్కు మేం సిద్ధం. గబ్బా, పెర్త్ పిచ్ ఏదైనా ఓకే. ఆస్ట్రేలియా గడ్డపై పింక్ బాల్ ఆడేందుకు ఆత్రుతగా ఎదురుచూస్తున్నాం."
-కోహ్లీ, టీమిండియా సారథి
గతేడాది నవంబర్లో బంగ్లాదేశ్తో టీమిండియా పింక్ బాల్ టెస్టు ఆడింది. అనంతరం ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు స్పందించింది. తమ జట్టుతో కూడా డే/నైట్ టెస్టు ఆడాలని కోరింది.