ఈ నెల 12 నుంచి 18 వరకు టీమిండియాతో తలపడనున్న మూడు వన్డేల సిరీస్కు దక్షిణాఫ్రికా జట్టు సిద్ధంగా ఉంది. భారత్లో కరోనా(కోవిడ్-19) కేసులు నమోదవుతున్నా ఆ జట్టు ఆందోళన చెందడం లేదని చెప్పింది. కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా ఉన్నామని, భారత్లో పర్యటించే తమ జట్టుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటామని క్రికెట్ దక్షిణాఫ్రికా ఒక ప్రకటనలో తెలిపింది. సఫారీల టీమ్ దుబాయ్ మీదుగా సోమవారం భారత్కు చేరుకోనుంది. అక్కడి నుంచి మ్యాచ్లు జరిగే ధర్మశాల(మార్చి 12), లక్నో(15), కోల్కతా(15) ప్రాంతాలకు ప్రత్యేక విమానంలో పయనిస్తారు.
"మ్యాచ్లు జరిగే నగరాల్లో ఒక్క కరోనా కేసూ నమోదవ్వలేదు. అలాగే ముందస్తు జాగ్రత్తగా జట్టు ప్రయాణించే నగరాలకు ప్రత్యేక విమానంలోనే పయనిస్తారు. మరోవైపు దుబాయ్, దిల్లీ నగరాల్లో వైరస్ ప్రభావం తక్కువగా ఉంది. కాబట్టి పెద్దగా ఆందోళన చెందాల్సిన పనిలేదు" అని ఆ దేశ జట్టు యాజమాన్యం వివరించింది. వైరస్ ప్రభావం తక్కువగా ఉన్నా అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పింది. అలాగే దక్షిణాఫ్రికా జట్టు ముఖ్య వైద్యాధికారి డాక్టర్ షుయబ్ మంజ్రా జట్టుతోనే ప్రయాణిస్తాడని తెలిపింది.
16 మందితో జట్టు
భారత పర్యటనకు మొదట సఫారీ జట్టులో 15 మందిని ఎంపిక చేయగా.. తాజాగా ఒకర్ని చేర్చి మొత్తం 16 మందిని పంపిస్తున్నట్టు జట్టు యాజమాన్యం వెల్లడించింది.
ఇప్పటికే కరోనా వల్ల ప్రపంచవ్యాప్తంగా పలు క్రీడాటోర్నీలు రద్దవుతున్నాయి. మరోవైపు భారత్లో ఇప్పుడిప్పుడే కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో మరికొద్ది రోజుల్లో ప్రారంభమయ్యే ఐపీఎల్ను కూడా యథావిథాగా నిర్వహిస్తామని, అంతకన్నా ముందు తగిన జాగ్రత్త చర్యలు తీసుకుంటామని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్గంగూలీ స్పష్టం చేశాడు.
ఇదీ చూడండి.. 104 ఏళ్ల బామ్మకు నారీశక్తి పురస్కారం