దక్షిణాఫ్రికా క్రికెట్లో పాలన సంక్షోభం ఏర్పడింది. దీంతో ఆ దేశ క్రికెట్ బోర్డుపై ఐసీసీ నిషేధం విధించే అవకాశముంది. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా క్రికెట్లోని మూడు జట్ల కెప్టెన్లు ఆందోళన వ్యక్తం చేశారు. వారి సంతకాలతో ఓ సంయుక్త ప్రకటనను విడుదల చేశారు.
ఈ సమస్య ఇక్కడితో పరిష్కారం కాకపోతే త్వరలో భారత్ వేదికగా జరగబోయే టీ20 ప్రపంచకప్ నుంచి ప్రోటీస్ టీమ్ను.. ఐసీసీ నిషేధించే అవకాశముంది. భవిష్యత్ గురించి ఉత్సాహంగా ఉండాల్సిన సమయంలో.. ఆందోళన పడే పరిస్థితి ఏర్పడిందని కెప్టెన్లు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: షెడ్యూల్ ప్రకారమే డబ్ల్యూటీసీ ఫైనల్: ఐసీసీ
అసలేం జరిగింది..
ఐసీసీ నిబంధనల ప్రకారం ఏ దేశ క్రికెట్ బోర్డు అయినా స్వతంత్రంగా ఉండాలి. వాటి వ్యవహారాలలో ప్రభుత్వాలు కల్పించుకోకూడదు. దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు కొత్త పాలన మండలి ఏర్పాటు విషయంలో సభ్యుల మధ్య విభేదాలు వచ్చాయి. ఇక ప్రభుత్వం జోక్యం చేసుకోవడం తప్ప వేరే మార్గం లేదని ఆ దేశ క్రీడా మంత్రి తెలిపారు.
మొత్తం 14 మందితో కూడిన మండలిలో ఆరుగురు మాత్రమే కొత్త పాలన మండలికి అనుకూలంగా ఉన్నారు. ఐదుగురు వ్యతిరేకత చూపిస్తున్నారు. మరో ముగ్గురు తటస్థంగా ఉన్నారు. కొత్త మండలి ఏర్పాటుకు కనీసం 75 శాతం సభ్యుల మద్దతు అవసరం. దీంతో ప్రభుత్వ జోక్యం తప్పనిసరి అయింది. సౌతాఫ్రికా క్రీడా చట్టం ప్రకారం బోర్డులో ఏవైనా వివాదాలు వచ్చినప్పుడు ప్రభుత్వం జోక్యం చేసుకునే అధికారం ఉంది.
ఇదీ చదవండి: ఒలింపిక్స్ కోసం గబ్బా స్టేడియం పునర్ నిర్మాణం