వరుస వైఫల్యాలతో సతమతవుతున్న అగ్రశ్రేణి షట్లర్ కిదాంబి శ్రీకాంత్ తిరిగి గాడిన పడేందుకు మరో అవకాశం. మంగళవారం ఆరంభం కానున్న హైలో ఓపెన్ సూపర్ 500 టోర్నీలో ఉత్తమ ప్రదర్శనతో అతను.. తిరిగి సత్తా చాటాలనే పట్టుదలతో ఉన్నాడు. డెన్మార్క్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్లో ప్రపంచ నంబర్వన్ కెంటో మొమొటా చేతిలో శ్రీకాంత్ ఓడాడు. ఇప్పుడా పరాజయాల బాట వదిలి గెలుపు మార్గం పట్టాలనే ధ్యేయంతో ఉన్నాడు. ఆరో సీడ్గా బరిలో దిగుతున్న శ్రీకాంత్ తొలి రౌండ్లో కోకి వటనాబె (జపాన్)తో తలపడుతున్నాడు.
యువ షట్లర్ లక్ష్యసేన్తో పాటు సమీర్ వర్మ, శుభంకర్, హెచ్ఎస్ ప్రణయ్, సౌరభ్ వర్మ తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. ఫ్రెంచ్ ఓపెన్లో క్వార్టర్స్ వరకూ వెళ్లగలిగిన 20 ఏళ్ల లక్ష్యసేన్ తొలి రౌండ్లో థామస్ (ఫ్రాన్స్)తో పోటీపడుతున్నాడు. తొలి రౌండ్లో కున్లావుత్ (ధాయ్లాండ్)తో సమీర్, ఎంగుయెన్ (ఐర్లాండ్)తో ప్రణయ్, వీస్కిర్చెన్ (జర్మనీ)తో సౌరభ్ ఢీ కొడుతున్నారు. పురుషుల డబుల్స్లో సుమిత్ రెడ్డి-మను అత్రి, మహిళల డబుల్స్లో అశ్విని పొన్నప్ప- సిక్కిరెడ్డి జోడీలు టైటిల్పై కన్నేశాయి.