కొవిడ్ వల్ల సంక్షోభంలో కూరుకుపోయిన ఆర్థిక వ్యవస్థను తిరిగి వృద్ధి పట్టాలెక్కించడానికి, వ్యవసాయ రంగ అనుబంధ పరిశ్రమలతో పాటు చిన్న మధ్య తరహా పరిశ్రమల ఉనికిని కాపాడటానికి, పెద్ద కార్పొరేట్ సంస్థల దివాలా సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం అనేక చర్యలకు ఉపక్రమించింది. ఆ దిశగా మూడు ఆర్థిక ఉద్దీపనలను ప్రకటించింది. వీటితోపాటు రిజర్వు బ్యాంకు తీసుకున్న మద్దతు చర్యల విలువ కలిపి రూ.29.87 లక్షల కోట్లు. ఇది జీడీపీలో 15శాతం. ఈ ఉద్దీపన విధానాలు ఆర్థిక వ్యవస్థపై ఎప్పుడు, ఎలాంటి ప్రభావం చూపుతాయనేది ఇప్పుడే చెప్పలేం. కార్పొరేట్ సంస్థల ద్రవ్యత్వంపై దృష్టి సారించిన ఈ ఉద్దీపన చర్యలు.. కార్పొరేట్ రంగంలో పరిస్థితులు మరింత దిగజారకుండా నిరోధించగలిగాయి.
వడ్డీలు చెల్లించే స్థితికి..
రుణ కేటాయింపులకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం వల్ల ఇప్పటికే అప్పులతో నెట్టుకొస్తున్న కంపెనీలపై అధిక భారం పడుతుంది. ఈ రూపాల్లో అందించే సహాయం ప్రభుత్వం ప్రత్యక్షంగా చేసే సహాయానికి ఎంత మాత్రం సమానం కాదు. భారతీయ కంపెనీలు దివాలా అంచుకు జారితే వాటి విలువ తగ్గుతుంది. అప్పుడు విదేశీ పెట్టుబడిదారులు లిస్టెడ్ కంపెనీలను తక్కువ విలువకే స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. వ్యాపార సంస్థలు వాటి అప్పులపై వడ్డీలు చెల్లించే స్థితికి ఎదగడానికి ప్రభుత్వం సహాయం చేయాలి. ఎంతోమందికి జీవనాధారమైన, ప్రభుత్వాలకు ప్రధాన వనరులైన కార్పొరేట్ సంస్థలను కాపాడి, వాటి సామర్థ్యాన్ని పెంచాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది.
సంక్షోభాలను ఎదుర్కొనేలా..
కొవిడ్ సంక్షోభంలో కార్పొరేట్ రంగం పునరుజ్జీవనంపై ఒక వర్కింగ్ గ్రూప్ ఏర్పాటైంది. దీనికి ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ 'కో-చైర్'గా వ్యవహరించారు. ఇది కార్పొరేట్ రంగ పునర్నిర్మాణం కోసం ప్రభుత్వాలు చేపట్టాల్సిన చర్యలు, రూపొందించాల్సిన విధివిధానాలపై సమగ్ర నివేదిక ఇచ్చింది. కార్పొరేట్ కంపెనీలకు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు(ఎంఎస్ఎంఈ) అందించే మద్దతు కేవలం వాటి రుణ సమస్యలను పరిష్కరించేలా మాత్రమే కాదు- భవిష్యత్తులోనూ సంక్షోభాలను ఎదుర్కొని నిలబడగలిగే సామర్థ్యాన్ని కల్పించేలా ఉండాలి. దేశంలోని అన్ని కంపెనీలకూ ప్రభుత్వం మద్దతు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆర్థిక వ్యవస్థకు హాని చేసే మార్కెట్ వైఫల్యాలను అదుపులో ఉంచుకుంటూ- ఆర్థిక వనరులను సంరక్షించి, విలువను సృష్టించే సంస్థలకు ప్రభుత్వ వనరులను తరలించాలని సూచించింది.
ఎంఎస్ఎంఈల ప్రాధాన్యం..
ప్రభుత్వం ఏ కంపెనీలకు సహాయం చేయాలనేది- దాని ప్రాధాన్యాలు, అందుబాటులో ఉన్న వనరులు, మార్కెట్ వైఫల్యాలకు సామాజిక వ్యయాలకుగల అనుసంధానం, ఏ కంపెనీలు ఏ విధమైన ప్రభుత్వ మద్దతు పొందాలనే నాలుగు అంశాలపై ఆధారపడి ఉండాలి. పెద్ద కంపెనీలు లాబీయింగ్ చేయగలవు. భారత్ లాంటి దేశాల్లో ఎంఎస్ఎంఈల వైఫల్యాలు సంఘటిత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిని దెబ్బతీసి అనధికారిక ఆర్థిక వ్యవస్థ పరిమాణాన్ని పెంచుతాయి. కొన్ని రంగాల్లో కొన్ని పెద్ద కంపెనీలు- మార్కెట్ను శాసించకుండా పోటీ పరిస్థితులను సృష్టించడానికి ఎంఎస్ఎంఈల సంరక్షణకు ప్రాధాన్యమివ్వాలి. ఉన్న ఉద్యోగాలను సంరక్షించాలి. 'సృజనాత్మక విధ్వంసం (క్రియేటివ్ డిస్ట్రక్షన్)' విధానాలను ప్రోత్సహించాలి. దీనివల్ల పాత సంస్థలు మన ఆర్థిక వ్యవస్థకు సరిపోయే కొత్త సంస్థలుగా రూపాంతరం చెందడానికి అవసరమైన చొరవ తీసుకున్నట్లవుతుంది.
భరించతగ్గ స్థాయిలోనే..
ఇండియా రుణ-జీడీపీ నిష్పత్తి 85శాతానికి చేరింది. ఇది ప్రమాద స్థాయికి చేరిందా అన్న విషయం దేశంలో వడ్డీరేటుకు వృద్ధిరేటుకు మధ్య ఉన్న వ్యత్యాసంపై ఆధారపడి ఉంటుంది. వడ్డీరేటు దేశంలో వృద్ధిరేటు కంటే ఎక్కువగా ఉంటే ప్రభుత్వ రుణం భరించతగ్గ స్థాయిలోనే ఉన్నట్లని ఇటీవలి ఆర్థిక సర్వే పేర్కొంది. ఈ లెక్కన దేశంలో ఇప్పటివరకు రుణాలపై ప్రభుత్వం చెల్లించే వడ్డీరేటు వృద్ధిరేటుకంటే తక్కువగానే ఉంది. కాబట్టి ప్రభుత్వ రుణం భరించదగ్గ స్థాయిలోనే ఉందని అభిప్రాయపడాల్సి ఉంటుంది.
మూడు రకాల సంస్థలపై...
ఎంఎస్ఎంఈల ప్రాథమిక సమస్యలు- సరైన పూచీకత్తు లేకపోవడం, నగదు ప్రవాహంలో అనిశ్చితి అధికంగా ఉండటం, పరిమితమైన సమాచారం అందుబాటులో ఉండటం. కాబట్టి వీటికి బ్యాంకుల ద్వారా ప్రభుత్వ మద్దతు అందించడమే ఉత్తమం. ప్రభుత్వం తన శక్తి సామర్థ్యాలను ప్రధానంగా మూడు రకాల సంస్థలపై కేంద్రీకరించాలి. అవి 1.ఆర్థికంగా లాభదాయకమైన మూలధనానికి, రుణాలకు మధ్య నిష్పత్తి(లీవరేజి) తక్కువగా ఉండి, ఆర్థిక వనరుల అందుబాటు పరిమితంగా ఉన్న సంస్థలు, 2. లాభదాయకమైన వ్యాపార నమూనా ఉండి కూడా అధిక లీవరేజితో, ద్రవ్య లభ్యతలేని సంస్థలు, 3.లాభదాయకమైన వ్యాపార నమూనా కలిగి ఉండి, అధిక లీవరేజితో దివాలా అంచున ఉన్న సంస్థలు. ఇలాంటి వాటిని కాపాడటంపైనే ప్రభుత్వం ప్రధానంగా దృష్టి పెట్టాలని నివేదిక సూచించింది. అందుకు తగిన విధి విధానాలను రచించాలి. వాటిని సమర్థంగా అమలు చేయాలి.
కార్పొరేట్ రంగంలో విధానాల రూపకల్పన, వాటి అమలులో ప్రభుత్వ ప్రమేయం వివిధరకాలుగా ఉండాలని నివేదిక సిఫార్సు చేసింది. బ్యాలెన్స్ షీట్లను పునరుద్ధరించే అవకాశం ఉండే సంస్థలకు ఈక్విటీల రూపంలో మద్దతివ్వడం సహా, రుణాల పునర్నిర్మాణం, దివాలా విధానాలను మెరుగుపరచడం ద్వారా సంబంధిత ప్రక్రియను వేగవంతం చేయాలి.
తగ్గిన ఆదాయాలు
ప్రస్తుతం దేశంలో కొవిడ్ తెచ్చిన ఉద్యోగ లేమి, ఆర్థిక కార్యకలాపాల స్తంభన ఫలితంగా ప్రజల ఆదాయాలు పడిపోయాయి. వినియోగం, దరిమిలా వడ్డీ చెల్లింపుల సామర్థ్యం తగ్గాయి. అది తిరిగి బ్యాంకుల్లో నిరర్థక ఆస్తుల పెరుగుదలకు కారణమవుతుంది. బ్యాంకుల్లో నిరర్థక ఆస్తుల నిర్వహణకు ఒక ప్రత్యేక (బ్యాడ్బ్యాంకు వంటివి) సంస్థను ఏర్పాటు చేయాలని నివేదిక సిఫార్సు చేసింది. ప్రభుత్వం ఇటీవలి బడ్జెట్లో దీనిపై ప్రకటన కూడా చేసింది. కోట్లమందికి జీవనాధారమైన కార్పొరేట్, ఎంఎస్ఎంఈ రంగాల్లో కొవిడ్ అనంతరం దివాలా పరిస్థితులు ఉత్పన్నం కాకుండా చూడాలి. ఆర్థిక వ్యవస్థలో దీర్ఘకాలిక వృద్ధికి, స్థిరత్వానికి అది చాలా అవసరం. ప్రభుత్వ శక్తి సామర్థ్యాలకు, చిత్తశుద్దికి ఇది పరీక్షా సమయం!
వృద్ధి ప్రేరేపకాలు
ఎంఎస్ఎంఈలు భారత ఆర్థిక వ్యవస్థలో వృద్ధి ప్రేరేపకాలు. ఇవి భారత స్థూల దేశీయోత్పత్తిలో 30శాతం వాటా కలిగి ఉన్నాయి. ఎగుమతుల విషయానికొస్తే, అవి సరఫరా గొలుసుల్లో అంతర్భాగం. మొత్తం ఎగుమతుల్లో 40శాతం వాటా వీటిదే. దేశవ్యాప్తంగా 11.09 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తూ దేశంలో ఎంతో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. వీటిలో సగానికి పైగా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తాయి కాబట్టి వాటి కార్యకలాపాలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థతో ముడిపడి ఉన్నాయి. అందుకని, ప్రభుత్వం వీటికి తగిన రీతిలో ప్రోత్సాహకాలు కల్పించాల్సిన అవసరం ఉంది.
-డాక్టర్ కల్లూరు శివారెడ్డి (రచయిత- పుణెలోని గోఖలే ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాలిటిక్స్ అండ్ ఎకనమిక్స్లో ఆచార్యులు)
ఇదీ చూడండి:పర్యావరణహిత పురోభివృద్ధితోనే భవిత