అబ్బాయిలతో సమానంగా అన్ని రంగాల్లోనూ దూసుకుపోతున్నారు అమ్మాయిలు. కానీ బరువు పెరుగుతామనో, నిర్లక్ష్యమో తెలియదు కానీ... పోషకాహారం విషయంలో మాత్రం వారికంటే వెనకే ఉంటున్నారంటారు వైద్యులు. అందుకోసమే ఈ సూచనలు
- ఉదయం లేచిన అరగంట లోపే ఏదో ఒకటి తినాలి. రెండు ఖర్జూరాలు, గుప్పెడు నానబెట్టిన బాదం గింజలు, ఓ గుడ్డు తింటే చాలు... అల్పాహారం అక్కర్లేదు. లేదంటే గ్లాసు పాలు, బాదం గింజలూ, రెండు ఇడ్లీలు... తీసుకుంటే రోజంతా చురుగ్గా పనిచేసుకోగలరు.
- అల్పాహారానికీ, భోజనానికీ మధ్య ఆకలేస్తే ఓ గ్లాసు పళ్ల రసం తాగండి. మధ్యాహ్న భోజనంలో బఠానీలూ, బీన్స్, రాజ్మా, సెనగలు, ఆకుకూరలు, కాయగూరలు, పప్పు, పెరుగు వంటివి ఉండేలా చూసుకోండి. వీటిల్లో ఐరన్, జింక్, క్యాల్షియం వంటి ఖనిజాలతో పాటు విటమిన్లూ పుష్కలంగా దొరుకుతాయి. ఆహార ప్రణాళిక వేసుకోవడం వల్ల అన్ని పోషకాలూ శరీరానికి అందుతాయి. ఎప్పుడైనా భోజనం చేసే తీరిక లేకపోతే... నాలుగైదు నానబెట్టిన బాదం గింజలు, పండ్లముక్కలు, ఓ చిక్కీ తినండి. కడుపు నింపుతాయి...అవసరమైన శక్తినీ ఇస్తాయి.
- రాత్రిళ్లు తేలిగ్గా ఉండే ఆహారం తీసుకోండి. చపాతీ, కప్పు అన్నం, కూర వంటివి చాలు. మసాలాలు, మాంసాహారం వంటివి ఈ వేళలో సాధ్యమైనంత తక్కువ తినండి. పడుకునే ముందు గ్లాసు పాలు తాగగలిగితే... శరీరానికి తగినంతగా క్యాల్షియం అందుతుంది. మీరు ఆరోగ్యంగా ఉండగలుగుతారు.
ఇవీ చదవండి: జ్వరం టీకాతోనా?.. వైరస్వల్లా?