సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం దాచారం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. విద్యుదాఘాతంతో నిమ్మ కవిత అనే మహిళ మృతి చెందింది. కవిత శనివారం తన భర్త ఆంజనేయులుతో కలిసి పొలం పనులకు వెళ్లింది. ఆంజనేయులు మధ్యాహ్నం ఇంటికి వెళ్లగా.. కవిత వరి పొలంలో కలుపు తీస్తుంది. ఈ క్రమంలోనే ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు కాలికి తగలడం వల్ల అక్కడికక్కడే మృతి చెందింది.
ఆంజనేయులు పొలం వద్దకు వచ్చే సరికి విగత జీవిగా పడి ఉన్న భార్యను చూసి బోరున విలపించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలికి భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు.