పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ మృత్యువుతో పోరాటం చేస్తున్నారు. రక్తంలో ప్లేట్లెట్స్ సంఖ్య భారీగా తగ్గడం వల్ల ఆరోగ్యం మరింత క్షీణించిందని వైద్యులు తెలిపారు. పనామా పత్రాల కేసులో జైలులో ఉన్న షరీఫ్ను.. ఆరోగ్యం క్షీణించిన కారణంగా సోమవారం రాత్రి ఆసుపత్రికి తరలించారు. గతంలో నవాజ్కు గుండెపోటు వచ్చినప్పటి నుంచి ఆయన మందులు వాడుతున్నారు. ఆ మందుల వాడకం వల్లే ప్లేట్లెట్స్ సంఖ్య పడిపోయినట్లు తెలిపారు వైద్యులు. ప్రస్తుతం ఆ ఔషధాలు వాడడాన్ని నిలిపేశారు.
షరీఫ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని.. బతికేందుకు పోరాడుతున్నారని.. ప్లేట్లెట్స్ పడిపోవడం, గుండెపోటు కారణంగా మూత్రపిండాల పనితీరు క్షీణించిందని ఆయన వ్యక్తిగత వైద్యుడు అద్నాన్ ఖాన్ వెల్లడించారు. రక్తంలో ఇన్సులిన్ స్థాయి తక్కువగా ఉండటం, రక్తపోటులో క్షీణత వల్ల తీవ్ర అనారోగ్యంతో ఉన్నారని స్పష్టం చేశారు.
షరీఫ్తో పాటు...
మెరుగైన వైద్యం కోసం విదేశాలకు వెళ్లేందుకు షరీఫ్ సంసిద్ధత వ్యక్తం చేసినప్పటికీ.. కోర్టు అనుమతి పొందాల్సి ఉందని ఆయన సోదరుడు షబాజ్ తెలిపారు. పనామా పత్రాల కుంభకోణం కేసులో షరీఫ్ ప్రస్తుతం జైలులో ఉన్నారు. మరో మాజీ ప్రధాని అబ్బాసీ కూడా తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. ఆయన కూడా ఓ అవినీతి కేసులో నిందితుడిగా ఉన్నారు.
ఇదీ చూడండి: ఆ సీఎం కొరడా దెబ్బలు తిన్నారు.. ఎందుకు?