సౌదీ అరేబియా రాజధాని రియాద్లో జరుగుతున్న మూడో 'ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ ఇనీషియేటివ్(ఎఫ్ఐఐ)' వాణిజ్య సదస్సులో ప్రధాని నరేంద్రమోదీ ప్రసంగించనున్నారు. ప్లీనరీ సెషన్లో భాగంగా భారత కాలమానం ప్రకారం ఇవాళ సాయంత్రం 8 గంటలకు ప్రధాని కీలక ప్రసంగం చేస్తారు. భారత దేశ ప్రగతి, అంతర్జాతీయ వ్యాపారాలు, ఆర్థిక మార్కెట్లపై భారత ఆర్థిక వృద్ధి దీర్ఘకాలిక ప్రభావం, ప్రస్తుత ప్రపంచ ఆర్థిక పోకడలు వంటి అంశాలను మోదీ ప్రధానంగా ప్రస్తావించనున్నారు.
ఈ సందర్భంగా సౌదీలో భారత పెట్టుబడులకు సంబంధించి ఇరుదేశాల ప్రతినిధులు సంయుక్త అవగాహన ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసే అవకాశముంది. అలాగే బ్రిడ్జ్వాటర్ అసోసియేట్స్ వ్యవస్థాపకులైన రే డాలియోతోనూ ముచ్చటించనున్నారు మోదీ. జనాభా, వాతావరణం తదితర అంశాలపై ఆయనతో చర్చించనున్నారు.
ఈ ఉదయమే ప్రారంభం
ఎడారి దేశంలో పెట్టుబడులు, పర్యటకుల ఆకర్షణే లక్ష్యంగా మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సు 'దావోస్ ఇన్ ద డెసెర్ట్'గా ప్రసిద్ధి. పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ గవర్నర్ యాసిర్ అల్-రుమయ్యన్ ప్రసంగంతో ఇవాళ ఉదయమే మొదలైన ఈ సమావేశంలో భారత దిగ్గజ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ కూడా పాల్గొన్నారు.
ఇమ్రాన్ ప్రసంగం.. ఖషోగ్గీ హత్య
గతేడాది జరిగిన ఇదే సమావేశంలో అమెరికాకు చెందిన పాత్రికేయుడు జమాల్ ఖషోగ్గీ హత్యకు గురయ్యారు. ఆ సమయంలో ఎఫ్ఐఐ సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన పాక్ ప్రధాని ఇమ్రాన్ఖాన్.. ప్లీనరీ సెషన్లో ప్రసంగించారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న సమావేశానికి పొరుగుదేశం ప్రధాని గౌర్హాజరయ్యారు.
సంబంధాలు మరింత బలం
సౌదీలో రెండు రోజుల పర్యటనలో భాగంగా ఈ ఉదయమే రియాద్ చేరుకున్నారు మోదీ. సౌదీ రాజు, యువరాజులు ప్రధానికి ఘనస్వాగతం పలికారు. అనంతరం ఓ అరబ్ పత్రికతో ముచ్చటించన మోదీ.. అమ్మకం-కొనుగోలుదారు స్థాయి నుంచి సన్నిహిత భాగస్వామ్యస్థాయి దిశగా వెళ్లేందుకు భారత్-సౌదీ అడుగులేస్తున్నట్లు చెప్పారు. భారత్లోని చమురు, గ్యాస్ ప్రాజెక్టుల్లో సౌదీకి చెందిన ఆరాంకో పెట్టుబడులు కూడా ఈ సంబంధాల్లో భాగమేనని స్పష్టం చేశారు.