ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. అయితే వైరస్ పుట్టిన దేశంగా భావిస్తున్న చైనాలో.. కొవిడ్ భయాలను పక్కనపెట్టి 71వ స్వాంతంత్ర్య వేడుకలు నిర్వహించుకున్నారు అక్కడి ప్రజలు. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఏర్పడి.. నేటికి 71 ఏళ్లైన సందర్భంగా బీజింగ్లోని తియాన్మెన్ స్క్వేర్ వద్ద భారీ జెండా ప్రదర్శన కార్యక్రమం అట్టహాసంగా జరిగింది.
తొలిసారి..
కొవిడ్-19 నిబంధనలు ఎత్తివేసిన తర్వాత తొలిసారి అత్యధికంగా ఎనిమిది రోజులు సెలవులు ప్రకటించింది చైనా. ఫలితంగా అక్కడి ప్రజలు తమ బంధువుల ఇళ్లకు, పర్యటక ప్రాంతాలకు ప్రయాణాలు చేశారు. స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలు.. చైనీయులకు రెండో అతిపెద్ద పండుగ. ఈ సమయంలో అక్కడి ప్రజలు విదేశాలకు వెళ్తారు. బంధువుల ఇళ్లను, పర్యటక ప్రదేశాలను సందర్శిస్తారు. చైనా సంప్రదాయ పండగైన 'మిడ్- అటమన్' ఉత్సవాలు ఇదే సమయంలో జరగడం వల్ల వారి ఆనందానికి అవధుల్లేవు.
దేశంలో కరోనా నియంత్రణలోకి వచ్చిన తర్వాత ప్రయాణాలపై ఉన్న నిబంధనలు ఎత్తివేసింది చైనా. అయితే ఇప్పటికీ అంతర్జాతీయ ప్రయాణాలకు అనుమతివ్వలేదు.
ఇదీ చూడండి: భారత్లోని శ్రమ జీవులకు అమెరికా ఆర్థిక సాయం