దాదాపు ఏడాది తర్వాత మళ్లీ ఉభయ కొరియాల మధ్య సంబంధాలు మొదలయ్యాయి. ఇరు పక్షాల మధ్య విశ్వనీయత పెంపొందించుకోవడంపై చర్యలు తీసుకొన్నారు. 2020లో ఇరు దేశాల మధ్య సదస్సు విఫలం కావడంతో ఉత్తరకొరియా హాట్లైన్ సంబంధాలను తెంచుకొంది. అంతేకాదు ఇంటర్ కొరియన్ బోర్డర్ ఆఫీస్ను పేల్చేసింది. వాస్తవానికి ఈ భవనాన్ని ఇరు దేశాల మధ్య సంబంధాలు పటిష్ట పర్చేందుకు నిర్మించారు.
తాజాగా ఇరుపక్షాల సంబంధాల పునరుద్ధరణపై ఉత్తరకొరియా న్యూస్ ఏజెన్సీ ప్రకటన చేసింది. 'అత్యున్నత నాయకుల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం.. ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య కమ్యూనికేషన్ లైజన్ లైన్ను ఏర్పాటు చేయనున్నారు. జులై 27వ తేదీ ఉదయం నుంచి ఇది అందుబాటులోకి వస్తుంది. ఇరు దేశాల మధ్య దెబ్బతిన్న సంబంధాలు పునరుద్ధరణకు చర్యలు తీసుకొనేందుకు అంగీకరించారు' అని ఆ పత్రిక పేర్కొంది.
ఇప్పటికే ఇరుపక్షాల ప్రతినిధులు కొత్తగా ఏర్పాటు చేసిన హాట్లైన్లో మూడు నిమిషాలపాటు మాట్లాడుకొన్నారు. భవిష్యత్తులో రోజువారీ చర్చలు జరుగుతాయన్నారు.
2018లో ఇరు దేశాల మధ్య సంబంధాలు గణనీయంగా మెరుగుపడ్డాయి. దక్షిణకొరియా అధినేత మూన్ జే ఇన్, ఉత్తరకొరియా అధినేత కిమ్జోంగ్ ఉన్ మూడు సార్లు చర్చల్లో పాల్గొన్నారు. కానీ, నాటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉ.కొరియా అధినేత కిమ్ల మధ్య వియత్నాంలో జరిగిన చర్చలు విఫలం కావడంతో ఆ ప్రభావం ద.కొరియాపై పడింది. ఇరు దేశాల మధ్య సంబంధాలు మళ్లీ దెబ్బతిన్నాయి.
ఇదీ చూడండి: సైనికులకు కరోనా- ప్రజలకు ప్రధాని క్షమాపణ