భారత్తో ఓ వైపు శాంతి మంత్రం పఠిస్తూనే చాపకింద నీరులా వ్యవహరిస్తోంది చైనా. అరుణాచల్ప్రదేశ్కు సమీపంలో బ్రహ్మపుత్ర నదిపై జలవిద్యుత్తు కేంద్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈమేరకు బిలియన్ల డాలర్లు విలువైన ప్రాజెక్టులతో కూడిన 14వ పంచవర్ష ప్రణాళికకు చైనా పార్లమెంట్ గురువారం ఆమోద ముద్ర వేసింది. అందులో వివాదాస్పద బ్రహ్మపుత్ర నదిపై జలాశయ నిర్మాణమూ ఉంది. ఈ డ్యామ్ నిర్మాణంపై మొదటి నుంచి భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోంది.
2వేలకుపైగా సభ్యులు కలిగిన చైనా పార్లమెంట్-నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ సమావేశాల చివరి రోజున.. 14వ పంచవర్ష ప్రణాళిక(2021-2025)కు ఆమోదం తెలిపింది. ఇందులో జాతీయ ఆర్థిక, సామాజిక అభివృద్ధి, 2035 వరకు దీర్ఘకాలిక లక్ష్యాలతో పాటు చైనా అభివృద్ధిని వేగవంతం చేసే 60 ప్రతిపాదనలు ఉన్నాయి. ఈ సమావేశానికి చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, ప్రధాని లి కెషాంగ్, ఇతర సీనియర్ నేతలు హాజరయ్యారు.
ఈ ప్రణాళికకు గత ఏడాదే ఆమోదం తెలిపింది అధికార కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా (సీపీసీ).
బ్రహ్మపుత్రపై డ్యామ్ ప్రధాన లక్ష్యమా?
బ్రహ్మపుత్ర నదిపై డ్యామ్ నిర్మించే ప్రతిపాదనను 14వ పంచవర్ష ప్రణాళికలో చేర్చింది చైనా. ఇప్పటికే ఈ నిర్మాణంపై భారత్తో పాటు బంగ్లాదేశ్లో పరివాహక రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే.. వారి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుంటామని చెబుతూనే నిర్మాణ పనులను వేగవంతం చేస్తోంది. నదీ పరివాహక ప్రాంతాల నీటి వినియోగ హక్కులపై భారత్ ఎప్పటికప్పుడు చైనా అధికారులతో తమ ఆందోళనలను తెలియచెబుతూనే ఉంది. ఎగువ ప్రాంతంలో చేపట్టే పనులతో దిగువన ఉన్న వారికి ఎలాంటి హాని కలగదని భరోసా కల్పించాలని కోరుతోంది.
ఎన్పీసీ సమావేశం జరుగుతున్న సమయంలోనే.. ఈ ఏడాదిలో జలాశయ నిర్మాణం ప్రారంభించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నట్లు టిబెట్ కమ్యూనిస్ట్ పార్టీ ఉపాధ్యక్షుడు చె డల్హా తెలిపారు. ప్రాజెక్టు కోసం సమగ్ర ప్రణాళిక, పర్యావరణ అనుమతులు త్వరలోనే వస్తాయన్నారు. అలాగే.. ఉత్తర టిబెట్లో వచ్చే ఐదేళ్లలో సహజ వాయువు ఉత్పత్తిపై ప్రధానంగా దృష్టి సారించినట్లు చెప్పారు.
అరుణాచల్ ప్రదేశ్తో సరిహద్దు పంచుకుంటున్న చివరి కౌంటీ అయిన మెడాగ్లోని యార్లూంగ్ జాంగ్బో లోయ ప్రాంతంలో ఈ డ్యామ్ నిర్మాణం చేపట్టేందుకు నిర్ణయించింది చైనా.
2015లోనే..
టిబెట్లో ఇప్పటికే 2015లో యాంగ్మూ హైడ్రోపవర్ స్టేషన్ను 1.5 బిలియన్ డాలర్లతో నిర్మించింది చైనా. అది టిబెట్ ప్రాంతంలోనే అతిపెద్ద జల విద్యుత్తు కేంద్రం. మరోవైపు.. సరిహద్దు నదులపై సమస్యల పరిష్కారానికి భారత్-చైనా ఉన్నతస్థాయి వ్యవస్థను 2006లో ఏర్పాటు చేశాయి. ఇరు దేశాల మధ్య కుదురిన ఒప్పందాల ప్రకారం వరదల సమయంలో బ్రహ్మపుత్ర, సట్లెజ్ నదుల సమాచారాన్ని భారత్కు అందిస్తుంది చైనా.
ఇదీ చూడండి: భారత్పై చైనా జలాయుధం!