నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టిన చైనా ప్రయోగాత్మక పునర్వినియోగ అంతరిక్షనౌక విజయవంతంగా తిరిగి వచ్చినట్లు అక్కడి మీడియా తెలిపింది. రెండు రోజుల క్రితం జికాన్ అంతరిక్ష కేంద్రం నుంచి మార్చ్-2ఎఫ్ రాకెట్తో ఈ ప్రయోగాన్ని చేపట్టారు.
ఈ ల్యాండింగ్ విజయవంతం కావడం పునర్వినియోగ అంతరిక్షనౌక సాంకేతికత పరిశోధనలో గొప్ప విజయంగా ఆ దేశ మీడియా వెల్లడించింది. అంతరిక్ష వినియోగం, ప్రయోగాల ఆర్థిక వ్యయంపై ఇది ప్రభావం చూపిస్తుందని తెలిపింది. అయితే ఈ విషయంపై చైనా సైన్యాధికారులు పూర్తి వివరాలు వెల్లడించలేదు.
"ఇలాంటి అంతరిక్షనౌక ప్రయోగం ఇదే తొలిసారి. ప్రయోగ విధానం కూడా పూర్తిగా భిన్నం." అని తెలిపారు చైనా సైన్యాధికారులు.
పెద్ద ఎత్తున ప్రయోగాలు...
ఇటీవల అంగారక గ్రహంపై తన తొలి ప్రయోగాన్ని చైనా విజయవంతంగా ప్రారంభించింది. మార్స్పై తియన్వెన్-1 పేరుతో మిషన్ను పంపింది. ఈ మిషన్ ద్వారా మార్స్పై గురుత్వాకర్షణ వంటి అంశాలను అధ్యయనం చేయనుంది. ఈ మిషన్లోని ఆర్బిటర్, ల్యాండర్, రోవర్ సరిగ్గా పనిచేస్తున్నట్లు చైనా జాతీయ అంతరిక్ష సంస్థ తెలిపింది. ఈ మిషన్ను పంపిన వారాల వ్యవధిలోనే చైనా ఈ పునర్వినియోగ అంతరిక్షనౌకను ప్రయోగించడం గమనార్హం.
ప్రస్తుతం ప్రపంచ దేశాలు ఆధారపడుతున్న అమెరికా దిక్సూచీ వ్యవస్థ(నావిగేషన్ సిస్టం) గ్లోబల్ పొజిషనింగ్ వ్యవస్థ(జీపీఎస్)కు పోటీగా తయారు చేస్తున్న బెయ్డో నావిగేషన్ సిస్టం ప్రాజెక్టును ఇప్పటికే పూర్తి చేసింది చైనా. ప్రాజెక్టు పూర్తి ఆపరేషన్కు కావాల్సిన 35 ఉపగ్రహాలు కక్ష్యలోకి చేరాయి.
- ఇదీ చూడండి: కిమ్ దర్శనం: వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన!