ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ అవతరించబోతోంది. 2027లోపు చైనాను వెనక్కి నెట్టి భారత్ తొలి స్థానాన్ని ఆక్రమిస్తుందని ఐక్యరాజ్యసమితి నివేదిక వెల్లడించింది. ఐరాసలోని ఆర్థిక, సామాజిక వ్యవహారాల విభాగం ప్రచురించిన 'ప్రపంచ జనాభా అంచనాలు -2019: ముఖ్యాంశాలు' అనే నివేదికలో 2050 నాటికి భారత్లో ఇప్పుడున్న జనాభాకు మరో 27.3 కోట్ల మంది పెరుగుతారని తెలిపింది.
రాబోయే 30 ఏళ్లలో ప్రపంచ జనాభా మరో 200 కోట్లు పెరుగుతుందని అంచనా వేసింది ఐరాస. 2050 వరకు ప్రస్తుతం ఉన్న జనాభా 7.7 బిలియన్ల నుంచి 9.7 బిలియన్లకు చేరుకుంటుందని తెలిపింది.
తొమ్మిది దేశాల్లోనే అధికం..
2050 వరకు పెరగనున్న జనాభాలో.. కేవలం 9 దేశాల్లోనే సగానికిపైగా పెరుగుదల ఉంటుందని నివేదిక వెల్లడించింది. అందులో భారత్, నైజీరియా, పాకిస్థాన్, డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఇథియోపియా, టాంజానియా, ఇండోనేసియా, ఈజిప్ట్, అమెరికా దేశాలు ఉన్నాయి. నైజీరియాలో 2050 వరకు 20 కోట్ల జనాభా పెరుగుతుందని తెలిపింది. 2050 వరకు పెరిగే ప్రపంచ జనాభాలో భారత్, నైజీరియా దేశాల జనాభా 23 శాతంగా ఉంటుందని అంచనా వేసింది.
8 ఏళ్లలో మొదటి స్థానం
ప్రస్తుత అంచనాల ప్రకారం అత్యంత జనాభా కలిగిన చైనాను భారత్ మరో 8 ఏళ్లలో వెనక్కి నెట్టి తొలిస్థానానికి చేరుకుంటుందని తెలిపింది ఐరాస. 2019 లెక్కల ప్రకారం చైనా 143 కోట్ల జనాభాతో మొదటి స్థానంలో ఉండగా.. భారత్ 137 కోట్లతో రెండోస్థానంలో ఉంది. అమెరికా 32.9 కోట్లు, ఇండోనేసియా 27.1 కోట్ల జనాభాతో ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
ఆరుగురిలో ఒకరు 65 ఏళ్ల పైబడిన వారే...
2050 నాటికి ప్రపంచ జనాభాలో ప్రతి ఆరుగురిలో ఒకరు 65 ఏళ్ల వయసు పైబడిన వారే ఉంటారని అంచనా వేసింది ఐరాస. ఇది ప్రపంచ జనాభాలో 16 శాతంగా ఉండనుందని స్పష్టం చేసింది. 80 ఏళ్లు పైబడిన వారి సంఖ్య మూడింతలు పెరగనుందని వెల్లడించింది. 2050 వరకు ప్రపంచ జనాభాలో 42.6 కోట్లు వయోవృద్ధులే ఉంటారని తెలిపింది.
పెరిగిన సగటు జీవిత కాలం
మనుషుల సగటు జీవిత కాలం పెరుగుతోందని తెలిపింది ఐరాస నివేదిక. 1990లో అది 64.2 ఏళ్లు ఉండగా.. 2019లో 72.6కు చేరింది. 2050 వరకు మనిషి సగటు ఆయుర్దాయం 77.1 ఏళ్లుగా ఉంటుందని నివేదికలో వెల్లడైంది.
ఇదీ చూడండి: భాజపా జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నడ్డా