బౌద్ధుల ఆధ్యాత్మిక గురువు దలైలామాను ఎంపిక చేసే హక్కు చైనాకు లేదని అమెరికా ప్రకటించింది. వందల సంవత్సరాల నుండి టిబెట్కు చెందిన బౌద్ధ మతస్థులే తదుపరి దలైలామాను ఎంపిక చేసుకుంటున్నారని అగ్రరాజ్యం మరోసారి స్పష్టం చేసింది. చైనా కమ్యూనిస్టు పార్టీ తమకా హక్కుందనటం అర్థరహితమని అమెరికాకు చెందిన లార్జ్ ఫర్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ రాయబారి శామ్యూల్ డీ బ్రౌన్బ్యాక్ అన్నారు.
అక్టోబర్లో తన భారత పర్యటన సందర్భంగా ధర్మశాలలో శరణార్థులుగా ఉన్న టిబెట్ పౌరులతో మాట్లాడానన్నారు బ్రౌన్బ్యాక్. తదుపరి దలైలామాను చైనా ఎంపిక చేయడానికి అమెరికా వ్యతిరేకమని వారికి స్పష్టం చేసినట్టు ఆయన వివరించారు. ఆ విధంగా చేసేందుకు డ్రాగన్కు హక్కు లేదని.. అందుకు ఏ సైద్ధాంతికత లేదని శామ్యూల్ వివరించారు. మత గురువుల ఎంపిక విషయంలో వందల సంవత్సరాలుగా నడుస్తున్న సంప్రదాయమే కొనసాగాలని ఓ ప్రశ్నకు జవాబుగా చెప్పారు. అగ్రరాజ్యం మత స్వేచ్ఛకు ఎప్పుడూ అండగా ఉంటుందని.. ఈ విషయమై టిబెట్కు మద్దతిచ్చేందుకు అమెరికా ఎప్పుడూ సిద్ధమేనని వెల్లడించారు.
ప్రస్తుతం ఉన్న 14వ దలైలామా వయస్సు 85 సంవత్సరాలు. స్థానిక టిబెట్ ప్రజల తిరుగుబాటును చైనా ప్రభుత్వం అణిచివేసి.. టిబెట్లో అనేక ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఆయన 1959 నుంచి భారత్లో ఆశ్రయం పొందుతున్నారు.
ఇదీ చదవండి: 'చైనా మైక్రోవేవ్ దాడి'.. అవాస్తవం: భారత ఆర్మీ