అమెరికా పౌరసత్వం లభించడం సులభతరం చేసే దిశగా అధ్యక్షుడు జో బైడెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించి నిర్వహించే పరీక్షల్లో మార్పులు తేనున్నారు. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతేడాది డిసెంబరులో ప్రవేశపెట్టిన 2020 సివిక్స్ టెస్ట్ను రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఆ స్థానంలో అంతకుముందు ఉన్న విధానాన్ని (2008 సివిక్స్ టెస్ట్) పునరుద్ధరించనున్నారు. ఈ ప్రక్రియ మార్చి 1 నుంచి అమలులోకి వస్తుందని యూఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) వెల్లడించింది.
"ఈ చర్య మన ఇమ్మిగ్రేషన్ వ్యవస్థపైన నమ్మకం కలిగించేలా ఉంది. 2020 సివిక్స్ టెస్ట్లో ఉన్న లొసుగులను ఇది తొలగిస్తుంది. 2008 సివిక్స్ టెస్ట్ 150పైగా సంస్థల సూచనలను పరిగణించి రూపొందించినది. 2020 డిసెంబరు 1 తర్వాత లేదా ఈ ఏడాది మార్చి 1 లోపు దరఖాస్తు చేసుకున్న వారు ఏ విధానాన్ని అయినా ఎంచుకోవచ్చు."
-అధికారులు, యూఎస్సీఐఎస్
కొత్త విధానంలో లోపాలేంటి?
పౌరసత్వం కోసం పొందే ప్రక్రియలో ఈ పరీక్షను నిర్వహిస్తారు. అమెరికా సిద్ధాంతాలు, ప్రభుత్వ విధివిధానాలు, చరిత్ర మొదలైన అంశాల మీద అభ్యర్థులకు ఉన్న అవగాహనను పరీక్షిస్తారు. అయితే ఇందుకు సంబంధించి ట్రంప్ తెచ్చిన కొత్త విధానంలో లోపాలు ఉన్నాయనే విమర్శలు వచ్చాయి. ప్రశ్నల సంఖ్య 100 నుంచి 128కు పెంచడం సహా సమాధానాలు అన్ని రాజకీయ కోణంలో ఉన్నాయని అభ్యర్థులు ఆరోపించారు.
ఇదీ చదవండి : ఆస్ట్రేలియాలో 'ఫేస్బుక్' - రాజీ కుదిరింది