Foreign Credit Cards Cheating: నకిలీ కాల్సెంటర్ నిర్వహిస్తూ అంతర్జాతీయ క్రెడిట్ కార్డుల నుంచి కోట్లు కొల్లగొడుతున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. నాలుగు నెలల వ్యవధిలో సుమారు కూ. 50 కోట్ల వరకు కాజేసిన హైదరాబాద్, దిల్లీకి చెందిన ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. A1 నిందితుడు దిల్లీకి చెందిన నవీన్ భూటాని ఆర్ఎన్ టెక్ సర్వీసెస్ పేరుతో సంస్థను స్థాపించి... విదేశీయులకు అవసరమైన ఆన్లైన్ సేవలు అందిస్తానంటూ గూగుల్లో ప్రకటన ఇచ్చాడు. మరో స్నేహితుడు మోహిత్ సహాయంతో 10 వెబ్సైట్లను రూపొందించాడు. హైదరాబాద్కు చెందిన నాగరాజు, శ్రీనివాస్ సాయంతో పేమెంట్ గేట్ వేలకు అనుమతి తీసుకొని... వాటిని వెబ్సైట్లకు అనుసంధానించాడు. టోల్ఫ్రీ నెంబర్ల కోసం దిల్లీ, పంజాబ్లో 80 మందితో మూడు కాల్సెంటర్లను ఏర్పాటు చేశాడు. వీరంతా కలిసి సంప్రదించిన ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సింగపూర్కు చెందిన వినియోగదారులను నమ్మించి... సేవలు అందించడానికి రుసుము నిర్ధరిస్తారు. అప్లికేషన్ లింక్ పంపించి డౌన్లోడ్ చేయాలని.. తద్వారా సర్వీస్ ఛార్జీలు చెల్లించాలని సూచిస్తారు. డౌన్లోడ్ చేసిన అప్లికేషన్ ద్వారా వినియోగదారుల క్రెడిట్ కార్డు వివరాలు, సీవీవీతో పాటు ఓటీపీ సేకరించి... క్రెడిట్ కార్డులో నుంచి నగదు అపహరిస్తారు.
యాప్ డౌన్లోడ్ చేసుకుని లింక్ షేర్ చేయమని చెబుతారు. తద్వారా మన మొబైల్ డివైజ్ మొత్తం వాళ్ల రిమోట్ కంట్రోల్లో ఉంటుంది. అనంతరం కాల్సెంటర్ల ద్వారా వినియోగదారులకు ఫోన్ చేయించి.. నమ్మించి క్రెడిట్ కార్డు వివరాలు సేకరిస్తారు. తద్వారా నగదు వాళ్ల ఖాతాలోకి నగదు మళ్లించుకుంటారు. -- స్టీఫెన్ రవీంద్ర, సైబరాబాద్ సీపీ
ప్రతినిధుల పేరుతో
నిందితులు టెలీకాలర్స్ ద్వారా ఈ కామర్స్ సంస్థలకు అనుసంధానమైన అంతర్జాతీయ క్రెడిట్కార్డు వినియోగదారుల ఫోన్నంబర్లు సేకరించారు. వాళ్లకు సందేశాలు, మెయిల్స్ పంపి సంస్థ ప్రతినిధుల పేరుతో నమ్మించారు. తర్వాత బ్యాంకు రహస్య వివరాలు సేకరించి వాళ్ల ఖాతాల నుంచి నగదును ఇతర ఖాతాల్లోకి మళ్లించారు. ఇలా నిందితులు పలు మార్గాల్లో విదేశీయులను మోసగించినట్లు సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసుల దర్యాప్తులో తేలింది.
మాదాపూర్లోని హెల్తీ డెంటల్ క్లినిక్కు చెందిన బ్యాంకు ఖాతాలో 20రోజుల క్రితం రూ. 64 లక్షలకు పైగా నగదు జమ అయింది. నగదు అంతా కూడా ఆస్ట్రేలియాకు చెందిన క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చినట్లు బ్యాంకు అధికారులు గుర్తించారు. అనుమానం వచ్చి సదరు పత్రాలను చూపించాలని ఆస్పత్రి నిర్వాహకుడిని అడగగా... చూపించకపోవడంతో బ్యాంకు ప్రతినిధులు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తీగ లాగితే విదేశీయుల క్రెడిట్ కార్డుల మోసాల డొంక బయటపడింది. మోసం చేసిన డబ్బు ఎక్కడికి తరలించారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ముఠా వెనక ఇంకా ఎవరెవరు ఉన్నారనే వివరాలను సేకరిస్తున్నారు. ఏడుగురు నిందితులను కస్టడీలోకి తీసుకొని ప్రశ్నిస్తే మరిన్ని వివరాలు తెలుస్తాయని పోలీసులు భావిస్తున్నారు. మనీలాండరింగ్ జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
ఇదీ చదవండి: Dead Body Found: కలకలం రేపిన 'తల'కు చెందిన మొండెం దొరికింది.. ఎక్కడంటే..?