మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ పట్టణ శివారులోని మామిడి తోటలో అభం శుభం తెలియని పిల్లలపై కర్కశంగా వ్యవహరించిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు డీఎస్పీ వెంకటరమణ తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఎవరైనా ఇలాంటి ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఇదీ జరిగింది..
తొర్రూరుకు చెందిన ఇద్దరు బాలురు తాము పెంచుకున్న కుక్క కనిపించడం లేదని.. పట్టణ శివారులోని మామిడితోటకు వెళ్లారు. మామిడికాయలు దొంగలించడానికే వచ్చారని భావించిన కాపలాదారులు.. వారిని పశువుల్ని కట్టినట్లు కట్టి.. చితకబాదారు. అంతటితో ఆగకుండా వారిచేత పేడ తినిపించి పైశాచిక ఆనందం పొందారు. వద్దంటున్నా.. కాళ్లు మొక్కుతానని వేడుకున్నా.. బోరున విలపిస్తున్నా వినకుండా చిత్రహింసలు పెట్టారు.
ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఈ విషయం తల్లిదండ్రులకు తెలిసి.. తొర్రూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కొందరు ప్రజాప్రతినిధులు.. ఈ వ్యవహారాన్ని కలెక్టర్, ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఉన్నతాధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.