ఆపరేషన్ అనంతర సమస్యల గురించి తెలిసి నిర్లక్ష్యంగా ఆపరేషన్ నిర్వహించడం వల్ల కంటి చూపు తగ్గిన బాధితుడికి పరిహారం చెల్లించాలంటూ రాష్ట్ర వినియోగదారుల కమిషన్ తీర్పు వెలువరించింది. నిజామాబాద్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న కట్టా శ్రీనివాసరెడ్డి కంటి చూపు మందగించడానికి కారణమైనందున రూ.5 లక్షల పరిహారం, ఖర్చుల కింద రూ.10 వేలు చెల్లించాలంటూ కోణార్క్ ఆసుపత్రిలోని డాక్టర్ డి.హరికృష్ణారెడ్డికి ఆదేశాలు జారీ చేసింది. 2012లో నిజామాబాద్లోని ట్రాఫిక్ కానిస్టేబుల్ శ్రీనివాసరెడ్డి సైనసైటిస్ సమస్యతో హైదరాబాద్ పేట్బషీరాబాద్లో కోణార్క్ ఆసుపత్రిలోని ఈఎన్టీ నిపుణుడైన డాక్టర్ హరికృష్ణారెడ్డితో శస్త్ర చికిత్స చేయించుకున్నారు.
ఆపై శ్రీనివాసరెడ్డికి కుడి కంటి చూపు మందగించింది. డాక్టర్ నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందంటూ రూ.43.27 లక్షల పరిహారాన్ని 18 శాతం వడ్డీతో చెల్లించాలంటూ శ్రీనివాసరెడ్డి 2014లో రాష్ట్ర వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించారు. పిటిషన్పై విచారించిన కమిషన్ అధ్యక్షుడు జస్టిస్ ఎం.ఎస్.కె.జైశ్వాల్, జస్టిస్ మీనా రామనాథన్లతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. డాక్టర్ నిర్లక్ష్యంగా వైద్యం అందించినట్లు తేలిందని..అందువల్ల ఫిర్యాదుదారుకు పరిహారంగా రూ.5 లక్షలు, ఖర్చుల కింద రూ.10 వేలు చెల్లించాలంటూ డాక్టరు హరికృష్ణారెడ్డిని ఆదేశించింది. ఆరు వారాల్లో ఈ సొమ్ము చెల్లించాలని లేని పక్షంలో 7 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది.