Assigned Lands illegal registration : ఉమ్మడి మహబూబ్నగర్, నల్గొండ జిల్లాల్లో అటవీ, ప్రభుత్వ భూములు పక్కదారిపట్టిన వ్యవహారంలో వాస్తవాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. నిబంధనలు ఉల్లంఘించి సర్వే నంబర్లకు ఉప సంఖ్యలు(బైనంబర్లు) వేసి యాజమాన్య హక్కులు కల్పించిన వ్యవహారంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ విచారణకు ఆదేశించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ల ఆదేశాలతో రెవెన్యూ యంత్రాంగం అప్రమత్తమైంది. నారాయణపేట జిల్లా బొమ్మన్ పహాడ్, నల్గొండ జిల్లా కట్టంగూరు మండలాల్లో ఈ తరహా అవకతవకలు భారీగా జరిగినట్టు క్షేత్రస్థాయి విచారణలో గుర్తించి, నివేదికలు రూపొందించే పనిలో తలమునకలైంది. అటవీశాఖ ఆధీనంలో ఉన్న భూముల్లోనూ కొందరికి హక్కులు కల్పించినట్టు గుర్తించిన ఆ శాఖ అధికారులు విడిగా మరో నివేదికను రూపొందిస్తున్నారు.
- నాగర్కర్నూల్ జిల్లా లింగాల మండలంలో రెవెన్యూ-అటవీ సరిహద్దుల్లో పేదలకు కేటాయించిన అసైన్డ్ భూములు భారీగా ఇతరుల పరమయ్యాయి. సర్వే నంబర్లకు బైనంబర్లు వేసి కొందరికి అక్రమంగా ఆ ఖాతాలో యాజమాన్య హక్కులు కల్పించినట్లు అధికారుల విచారణలో తేలినట్టు సమాచారం.
- నారాయణపేట జిల్లా బొమ్మన్ పహాడ్ గ్రామ పరిధిలో అసైన్డ్ భూములకు హక్కుల కల్పనలో జరిగిన అవకతవకలపై ఆర్డీవో వెంకటేశ్వర్లు నేతృత్వంలో విచారణ కొనసాగుతోంది.
- కొన్ని కుటుంబాలకు నిబంధనలకు విరుద్ధంగా యాజమాన్య హక్కులు కల్పించిన వ్యవహారం ప్రాథమికంగా నిర్ధారణయినట్టు తెలిసింది.
కట్టంగూరులో కదులుతున్న డొంక
illegal registration of Assigned Lands : నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం మల్లారం గ్రామ పరిధిలోని 130, 131, 132 సర్వే నంబర్ల ఉప సంఖ్యలలో కొందరికి అక్రమంగా అసైన్డ్ చేసినట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం. పహాణీల్లో 2004-05 వరకు హక్కుదారులుగా కొనసాగుతూ వచ్చిన కొందరు రైతులను తొలగించి, రెవెన్యూ రికార్డుల్లో ఇతరులను చొప్పించినట్లు, వారి పేర్లతోనే కొత్త పట్టాలు జారీ అయినట్లు తహసీల్దారు కార్యాలయం రూపొందించిన నివేదిక ఆ జిల్లా కలెక్టర్కు చేరింది. భూ దస్త్రాల ప్రక్షాళన సమయంలో ఎటువంటి నిబంధనలు పాటించకుండానే యాజమాన్య హక్కుల్లో మార్పులు చేసినట్టు అధికారులు నిర్ధారణకు వచ్చినట్టు తెలిసింది.
నివేదిక తీరుపై జిల్లా కలెక్టర్ ఆగ్రహం
Assigned Lands in Telangana : లింగాల మండలంలో అక్రమంగా సాగిన అసైన్డ్ పట్టాల వ్యవహారం వెలుగులోకి రావడంతో విచారించాల్సిందిగా కలెక్టర్ ఉదయ్కుమార్ అచ్చంపేట ఆర్డీఓ పాండునాయక్, లింగాల తహసీల్దారు మునీరుద్దీన్లను ఆదేశించారు. అధికారులు హుటాహుటిన నివేదిక సిద్ధంచేసి కలెక్టర్కు పంపారు. దాన్ని పరిశీలించిన కలెక్టర్ వారిపై ఆగ్రహం వ్యక్తంచేసినట్లు తెలిసింది. భూమి రకం, అసైన్డుదారుల వివరాలు, ఎంత కేటాయించారు, అనర్హులు ఉంటే వారి వివరాలు తదితర పూర్తి సమాచారంతో మళ్లీ నివేదిక పంపాలని ఆదేశించడంతో అధికారులు మళ్లీ దస్త్రాలను తిరగేసే పనిలో పడ్డారు.