- మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్ మండలం మసిగుండ్లపల్లిలో ఇంటి వద్ద మరుగుదొడ్డికి క్యూరింగ్ చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై కావలి రఘు ఈ నెల 25న మృతి చెందారు.
- గండీడ్ మండలం చెల్మిల్లలో 23వ తేదీన రైతు మల్లయ్య పొలం వద్ద విద్యుదాఘాతంతో మృతి చెందారు.
- జోగులాంబ గద్వాల జిల్లా ఈడిగోనిపల్లికి చెందిన మహేశ్వర్రెడ్డి 22న పొలం వద్ద విద్యుదాఘాతంతో దుర్మరణం పాలయ్యారు.
- మహబూబ్నగర్ జిల్లా భూత్పూరు మండలం మద్దిగట్ల గ్రామానికి చెందిన రాములు 21వ తేదీన ఇంటి వద్ద మోటారు పెడుతూ మృతి చెందారు.
- నాగర్కర్నూల్ జిల్లా లింగాల మండలం వల్లభాపురంనకు చెందిన రైతు రామస్వామి 21వ తేదీన పక్క వ్యవసాయ పొలంలో విద్యుతు తీగలు తగిలి మృతి చెందారు.
- వనపర్తి జిల్లా పాన్గల్లో 20వ తేదీన ఓ మహిళ ఇంటి ముందు ఉన్న సర్వీస్ తీగ తగిలి మృతి చెందారు.
- నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం లోకుర్తిలో కాశప్ప అనే యువ రైతు 19వ తేదీన నియంత్రిక వద్ద ఫ్యూజులు వేసేందుకు వెళ్లి విద్యుదాఘాతంతో మృతి చెందారు.
కేవలం వారం రోజుల వ్యవధిలో ఉమ్మడి జిల్లాలో నమోదైన విద్యుదాఘాత మరణాలు ఇవి. వర్షాకాలం మొదలైనప్పటి నుంచి తరచూ విద్యుదాఘాతాలతో మరణాలు సంభవిస్తున్నాయి. ఇక విద్యుత్తు నియంత్రికల వద్దకు వెళ్లి మృత్యువాత పడిన మూగ జీవాలూ పదుల సంఖ్యలో ఉన్నాయి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
విద్యుత్తు నియంత్రికలో ఫ్యూజ్ పోయినా.. తీగలు తెగినా అధికారులకు సమాచారం ఇవ్వాలి. రైతులే మరమ్మతు చేయడం, నియంత్రికలను ఆన్, ఆఫ్ చేయడం వద్ధు.
పొలానికి నీరు పెట్టే సమయంలో స్టార్టర్లకు, మోటార్లకు విద్యుత్తు వైర్లు తగిలి ఉండటంతో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. జాగ్రత్తగా గమనించాలి. ఐఎస్ఐ మార్కు ఉన్న మోటార్లు, స్టార్టర్లను మాత్రమే ఉపయోగించాలి. వాటికి ఎర్తింగ్ తప్పని సరిగా చేసుకోవాలి.
పశువులను, మేకలను విద్యుత్తు స్తంభాలకు కట్టివేయొద్ధు
సర్వీసువైరును దూరంగా తీసుకెళ్లాల్సి వస్తే పొలంలో కింద నేలపై, కట్టలపై వేయొద్ధు కచ్చితంగా స్తంభాలు వాడాలి.
ఇంటి వైరింగ్ను అర్హత, అనుభవం ఉన్న టెక్నీషియన్ ద్వారానే చేయించాలి.
వర్షం పడుతున్నప్పుడు, చేతులు తడిగా ఉన్నప్పుడు విద్యుత్తు సరఫరా చేసే పరికరాలు, స్తంభాలు, నియంత్రికలు, స్విచ్లను తాకొద్ధు
ఇంటి బయట లేదా మిద్దెపైన దుస్తులు ఆరవేయడానికి జీఐ వైరును విద్యుత్తు స్తంభాలకు గానీ, స్టే వైరుకు గానీ కట్టకూడదు.
నాలుగేళ్ల కిందట కుమారుడు.. ఇప్పుడు తండ్రి
నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం లోకుర్తికి చెందిన రైతు కాశప్ప (38) ఈ నెల 19న సాయంత్రం విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో ఫ్యూజులు వేసేందుకు వెళ్లి విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందారు. నాలుగేళ్ల కిందట ఆయన కుమారుడు వినాయక నిమజ్జనంలో భాగంగా చెరువులో మునిగి మృతి చెందాడు. భార్య గృహిణి. ఇద్దరు కుమార్తెలు ఉండగా పెద్దమ్మాయి వివాహం ఏడాది కిందట చేశారు. ఆ సమయంలో రూ.2 లక్షల అప్పు చేశారు. చిన్న కుమార్తెకు 10 ఏళ్లు ఉంటాయి. ఎకరంన్నర భూమి ఉండటంతో వ్యవసాయంతోపాటు కాశప్ప ఇళ్లు గడవడానికి కూలీ పనికి వెళ్లేవాడు. ఇప్పుడు ఆయన విద్యుత్తు ప్రమాదంలో చనిపోవడంతో ఆ కుటుంబానికి ఆధారం లేకుండా పోయింది.
ఒంటరైన కుటుంబం..
జోగులాంబ గద్వాల జిల్లాలోని గద్వాల మండలం ఈడిగోనిపల్లికి చెందిన మహేశ్వర్ రెడ్డి బుధవారం విద్యుత్తు సరఫరాలో అవాంతరాలు ఏర్పడటంతో నియంత్రికను ఆఫ్ చేసేందుకు వెళ్లి విద్యుదాఘాతంతో మృతి చెందారు. ఆయనకు భార్యతోపాటు ఆరేళ్ల కుమారుడు ఉన్నారు. దీంతోపాటు వృద్ధుడైన తండ్రి ఇంటికే పరిమితమయ్యారు. కొత్త సాంకేతిక పరిజ్ఞానం ద్వారా వ్యవసాయం చేయడంతో మహేశ్వర్ రెడ్డికి పేరు ఉంది. ఆయన మృతితో భార్యతోపాటు ఆరేళ్ల కుమారుడు, తండ్రికి ఆధారం లేకుండా పోయింది.
ఉమ్మడి జిల్లాలో విద్యుత్తు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. 2016 ఏప్రిల్ నుంచి 2020 మార్చి వరకు ఉమ్మడి జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం 241 మంది మృత్యువాత పడ్డారు. అనధికారికంగా ఈ సంఖ్య రెట్టింపు ఉంటుంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ వరకు అనధికారికంగా సుమారు 28 మంది విద్యుదాఘాతానికి బలయ్యారు.