నెహ్రు ఔటర్ రింగ్రోడ్డుపై యూజర్ ఛార్జీల వసూళ్లకు సంబంధించిన టెండర్ల గడువు పెంపుతోపాటు ఆరోపణలకు సంబంధించి వివరణ ఇవ్వాలంటూ హెచ్ఎండీఏకు (HMDA) హైకోర్టు ఆదేశాలిచ్చింది. యూజర్ ఛార్జీల వసూళ్లకు అక్టోబరు 22న జారీచేసిన నోటిఫికేషన్లో బిడ్ల స్వీకరణ గడువు పెంపును నిరాకరించడాన్ని సవాలు చేస్తూ ముంబయికి చెందిన సహకార్ గ్లోబల్ లిమిటెడ్ పిటిషన్ దాఖలు చేసింది.
దీనికి అనుమతిస్తూ జస్టిస్ కె.లక్ష్మణ్ విచారణ చేపట్టగా పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. టెండర్ నోటిఫికేషన్కు సంబంధించిన సందేహాల నివృత్తికి అక్టోబరు 30 గడువు ఇచ్చారని, ఈనెల 8లోగా బిడ్లను సమర్పించాల్సి ఉందన్నారు. ఈ బిడ్కు సంబంధించి కొన్ని సందేహాలు అడిగామని తెలిపారు. ఏడాదికి రూ.500 కోట్ల చెల్లింపుతో 18 నెలల కాలానికి చెందిన టెండర్లపై అధ్యయనానికి కొంత గడువు అవసరమని కోరారు. దీనికి హైదరాబాద్ గ్రోత్ కారిడార్ నిరాకరించిందన్నారు. టెండర్ను.. ఈగల్ ఇన్ఫ్రా ఇండియా లిమిటెడ్, ఇందర్జీప్ కన్స్ట్రక్షన్ కేటాయించాలన్న దురుద్దేశంతో తగినంత పోటీ లేకుండా గడువు పెంపునకు నిరాకరించారని ఆరోపించారు. వాదనలు విన్న న్యాయమూర్తి టెండర్ల నిర్వహణలో పిటిషనర్ల ఆరోపణలపై వివరణ ఇవ్వాలని హెచ్ఎండీఏను ఆదేశించారు. దీనిపై ఈనెల 8న మొదటి కేసుగా విచారణ చేపడతామంటూ విచారణను వాయిదా వేశారు.
ఇదీచూడండి: మద్యం తాగి నడిపిన వారి వాహనాలు సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదు: హైకోర్టు