శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా ఒంటిమిట్ట కోదండ రాముని ఆలయంలో సోమవారం రాత్రి 8 గంటల నుంచి.. 10 గంటల వరకు సీతారాముల కల్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. కొవిడ్ దృష్ట్యా భక్తులకు అనుమతి లేకపోగా.. తిరుమల తిరుపతి దేవస్థానం వేదపండితులు, ఉద్యోగులు.. ఏకాంతంగా రాములవారి కల్యాణం నిర్వహించారు. తిరుమల నుంచి వచ్చిన వేద పండితులు... రాజేశ్ ఆధ్వర్యంలో వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వామివారి కల్యాణం జరిగింది. కొవిడ్ ప్రభావంతో రెండో ఏడాదీ ఒంటిమిట్టలో సీతారాముల కల్యాణాన్ని పండితులు ఏకాంతంగానే నిర్వహించారు.
సీతారాముల కల్యాణ మహోత్సవానికి.. ప్రభుత్వం తరపున దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ హాజరయ్యారు. స్వామివారికి మంత్రి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. కల్యాణ క్రతువుకు ముందుగా ఆలయంలో ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించారు. బంగారు ఆభరణాలు, పట్టువస్త్రాలతో సీతారాములను అందంగా అలంకరించారు. పలు ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన పుష్పాలతో.. కల్యాణ వేదికను తీర్చిదిద్దారు. ఆలయం విద్యుత్ దీపాలంకరణతో వెలిగిపోయింది. సుమారు రెండు గంటల పాటు స్వామివారి కల్యాణ క్రతువు సాగింది.
రాష్ట్ర ప్రభుత్వం తరపున సమర్పించిన పట్టువస్త్రాలను స్వామివారి ఉత్సవ విగ్రహాలపై ఉంచారు. వేద మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ స్వామివారికి జీలకర్ర-బెల్లం పెట్టే క్రతువు నిర్వహించారు. అనంతరం.. కోదండ రాముడు సీతమ్మ మెడలో మాంగళ్యధారణ చేసే కార్యక్రమాన్ని వేదపండితులు నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ ఉదయం రథోత్సవం నిర్వహిస్తారు.
ఇదీ చదవండి: రేపు తిరుమలలో పౌర్ణమి గరుడవాహన సేవ