భూ యాజమాన్య హక్కుల కల్పన విధానంలో లోపాలు రైతుల పాలిట యమపాశాలుగా మారుతున్నాయి. సాగుచేసుకుంటున్న భూమికి, భాగ పంపిణీ ద్వారా వచ్చిన పొలానికి, వారసత్వ బదిలీ... తదితర భూములకు పాసుపుస్తకం ఇవ్వాలంటూ క్షేత్ర స్థాయిలో దాఖలవుతున్న దరఖాస్తుల విషయంలో సిబ్బంది తేల్చకుండా ఆలస్యం చేస్తుండటం రైతుల్లో ఆవేదనను నింపుతోంది. ఇవి కొన్ని చోట్ల వివాదాలకు కారణమవుతున్నాయి. దాదాపు తొమ్మిది లక్షల పాసుపుస్తకాల్లో తప్పులు దొర్లగా ఇప్పటికీ చాలా వాటిల్లో సరిదిద్దనే లేదు. చివరికి శనివారం ప్రాణం తీసుకున్న రాజిరెడ్డి కూడా పాసుపుస్తకంలో తన తండ్రిపేరు తప్పుగా వచ్చిందని సరిచేయాలని తిరుగుతున్నా ఫలితం లేకపోయిందని సూసైడ్నోట్లో పేర్కొన్నారు.
పది లక్షల మందికి నష్టం చేసిన ఉదాసీనత
కొందరు రెవెన్యూ ఉన్నతాధికారులు, సిబ్బంది ఉదాసీన వైఖరి కారణంగా రాష్ట్రంలో పది లక్షల మంది రైతులు రైతుబంధుకు దూరమవుతున్నారు. రాష్ట్రంలో 61.13 లక్షల వ్యవసాయ ఖాతాలు ఉండగా ఈ ఏడాది జనవరి నాటికి వ్యవసాయశాఖకు అందింది 51.43 లక్షల మంది రైతుల సమాచారమే. దీంతో అంతవరకు రైతుబంధు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 2017 సెప్టెంబరు నుంచి మొదలైన ఎల్ఆర్యూపీ, పాసుపుస్తకాల జారీ ప్రక్రియ నేటికీ కొలిక్కి చేరుకోవడమే లేదు. దీంతో రైతు బీమాకు కూడా రైతులు అనర్హులుగా మిగులుతున్నారు.
ప్రాణాలు తీసుకునే స్థాయిలో ఆవేదన...!
తాజాగా పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్లో రైతు రాజిరెడ్డి ఆత్మహత్యతో మళ్లీ రెవెన్యూ వ్యవస్థలో లోపాలు, లొసుగులు తెరపైకొచ్చాయి. కరీంనగర్ జిల్లా చిగురుమామిడిలో గత వానాకాలం పంట విక్రయాల సందర్భంగా ఓ రైతు ఇదే తీరులో ఆత్మహత్యకు ప్రయత్నించగా చివరికి ప్రాణం దక్కింది. క్షేత్రస్థాయి సిబ్బంది తిప్పించుకోవడంతో రైతులు ప్రాణాలు తీసుకుంటున్నారని ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. సిబ్బంది కొరత, నిబంధనల్లో అస్పష్టత కూడా కొంతవరకు కారణమని వివరిస్తున్నారు.
ఇదీ చదవండి: కరోనాకు డ్రగ్ రిలీజ్- ఒక్కో టాబ్లెట్ రూ.103