ఏపీలోని విశాఖ జ్ఞానాపురం శ్మశానవాటికలో చల్లారని చితిమంటలు.. కరోనా మారణ హోమానికి సాక్ష్యంగా నిలుస్తున్నాయి.. జ్ఞానాపురం శ్మశానవాటికలో కేవలం 10 నుంచి 15 మృతదేహాలకు అంత్యక్రియలు చేసేందుకు.. సరిపడా ప్లాట్ఫాంలే ఇక్కడున్నాయి. గతంలో రోజుకు నాలుగైదు మృతదేహాలే ఇక్కడకు వచ్చేవి. ఉన్న ప్లాట్ఫాంలే పూర్తిగా వినియోగించే అవసరం రాకపోయేది. కానీ..కరోనాతో పరిస్థితి తారుమారైంది.
మృతదేహాల రద్దీతో అంత్యక్రియలకు ప్లాంట్ఫాంలు సరిపోవడం లేదు. చేసేదేమీలేక శ్మశానవాటిక ఆవరణలో ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ చితిపేర్చేసి.. దహన సంస్కారాలు నిర్వహిస్తున్నారు. దానికి నిదర్శనమే ఈ ఆరని చితిమంటలు.
కొవిడ్ మృతులకు విశాఖ నగరంలో మరెక్కడా దహనం చేసేందుకు అనుమతి లేకపోవడం వల్ల ఈ శ్మశాన వాటికకు రద్దీ పెరిగింది. గురువారం ఒక్కరోజే 40కిపైగా మృతదేహాలను ఇక్కడ దహనం చేశారు. ఆస్పత్రుల నుంచి అంబులెన్స్లు నేరుగా ఇక్కడకు రావడం.. అందులో ఉన్న మృతదేహాలను వరుసపెట్టి దహనం చేయడం.. సిబ్బందికీ తలకుమించిన భారంగా మారింది. ఒకే అంబులెన్స్లో దాదాపు 8 మృతదేహాలు తెచ్చిన సందర్భం ఉందని నిర్వాహకులు చెప్తున్నారు. ప్లాట్ఫాంలు ఖాళీ లేకపోవడంతో.. ఆవరణలో ఖాళీగా ఉన్నచోట కట్టెలు పేర్చేసి దహనం చేస్తున్నారు. సమయానికి తినేందుకు వీల్లేని పని ఒత్తిడి ఉందని వాపోతున్నారు.
బంధువులు రావటం లేదు..
కొవిడ్ మరణాలు కావడంతో చాలావరకూ బంధువులెవరూ అంతిమ సంస్కారాలకు రావడం లేదు. ఒకరిద్దరు వచ్చినా అక్కడి పరిస్థితులు చూసి ఆక్రోశిస్తున్నారు. కొవిడ్ నుంచి కోలుకుని ఇళ్లకు వస్తారనుకున్నవారిని.. ఇలా శ్మశానంలో చూడాల్సి వస్తుందనుకోలేదంటూ వాపోతున్నారు..
కొవిడ్ నిబంధనల ప్రకారమే..
కొవిడ్ నిబంధనల ప్రకారమే మృతదేహాలు దహనం చేస్తున్నామని జ్ఞానాపురం శ్మశానవాటికి సిబ్బంది చెప్తున్నారు.
- ఇదీ చదవండి : యువతపై కరోనా పంజా.. రెండో దశలో 43 శాతం కేసులు