ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం(జూన్ 15 నాటికి)లో స్థూల ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 31 శాతం తగ్గాయి. ఇదే సమయానికి కార్పొరేట్ల అడ్వాన్స్ ట్యాక్స్లు ఏకంగా 79 శాతం తగ్గినట్లు ఆదాయపు పన్ను శాఖ ప్రకటించింది. అడ్వాన్స్ ట్యాక్స్ల చెల్లింపునకు జూన్ 15నే గడువు ముగిసినట్లు వెల్లడించింది.
వసూళ్లు లెక్కలు..
జూన్ 15 నాటికి ప్రత్యక్ష స్థూల పన్నుల వసూళ్లు రూ.1,37,825 కోట్లుగా ఉన్నాయి. గత ఏడాది ఇదే సమయానికి ప్రత్యక్ష పన్నుల వసూళ్లు రూ.1,99,755 కోట్లుగా ఉండటం గమనార్హం.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో మొదటి రెండు నెలలు దాదాపు లాక్డౌన్లో ఉండిపోయాయి. ఈ కారణంగా దేశవ్యాప్తంగా 80 శాతం ఆర్థిక కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. ఫలితంగా పన్ను వసూళ్లు తగ్గినట్లు ఆదాయపు పన్ను శాఖ తెలిపింది.
ఈ నెల ఆరంభం నుంచి లాక్డౌన్ సడలింపులు ఇచ్చినా.. ఆర్థిక వ్యవస్థ తెరుకునేందుకు ఇంకా సమయం పట్టొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.
ఇదీ చూడండి:ఆ వాహన సంస్థలో 1,000 ఉద్యోగాలు కోత!