చైనాలో కరోనా వైరస్ ప్రభావం భారత్లో టీవీలపై పడనుంది. వచ్చే నెల నుంచి టీవీల ధరలు 10 శాతం మేర పెరగనున్నాయి. కరోనా వైరస్ మూలంగా చైనాలో టీవీలకు సంబంధించి ఓపెన్ సెల్ టెలివిజన్ ప్యానెల్స్ సరఫరాకు అంతరాయం ఏర్పడటమే ఇందుకు కారణం.
అప్పటి వరకూ అంతే..
టీవీల తయారీలో అతి ప్రధానమైనవి ఈ టెలివిజన్ ప్యానెల్స్. టీవీ ధరలో దీని వాటా దాదాపు 60 శాతం ఉంటుంది. ఎక్కువగా చైనా నుంచి ఇవి దేశంలోకి దిగుమతి అవుతున్నాయి. చైనా నూతన సంవత్సరానికి తోడు కరోనా వైరస్ కారణంగా అక్కడ ఉత్పత్తి, సరఫరా నిలిచిపోయాయి. కొన్ని ఫ్యాక్టరీలు తెరుచుకున్నప్పటికీ నామమాత్రంగానే కార్మికులు పనిచేస్తున్నారు. దీనివల్ల ప్యానెల్స్ ధరలు 20 శాతం మేర పెరిగినట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. మళ్లీ ఉత్పత్తి పునరుద్ధరణ జరగాలంటే కనీసం మూడు నెలలైనా పడుతుందని అంచనా. దీని కారణంగా మార్చి నుంచి 10 శాతం మేర టీవీల ధరలు పెరగనున్నాయని ఎస్పీపీఎల్ (భారత్లో థామ్సన్ టీవీల లైసెన్స్దారు) సీఈవో అవనీత్ సింగ్ మార్వా తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో 30-50 శాతం ఉత్పత్తిలో కోత ఉంటుందని తెలిపారు.
ఫ్రిడ్జ్లు, ఏసీలు ప్రియం..
టీవీలతో పాటు రిఫ్రిజిరేటర్లు, ఏసీల ధరలూ పెరుగుతాయని హైయర్ ఇండియా ప్రెసిడెంట్ ఎరిక్ బ్రగాన్జా తెలిపారు. వీటి ధరల్లోనూ మార్చి నుంచే పెరుగుదల కనిపించనున్నట్లు పేర్కొన్నారు. చాలా కంపెనీలు వీటికి సంబంధించిన కంప్రెషర్లను చైనా నుంచే దిగుమతి చేసుకుంటుండటం ఇందుకు కారణం.
ఇదీ చూడండి:రాష్ట్రాలకు రూ.19,950 కోట్ల జీఎస్టీ పరిహారం విడుదల