స్టాక్ మార్కెట్లు నేడు రికార్డు స్థాయి లాభాలతో ముగిశాయి. వృద్ధికి ఊతమందించే దిశగా కార్పొరేట్ సుంకాలు తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా కొనుగోళ్ల పర్వం మొదలైంది. వీటికి తోడు జీఎస్టీ మండలి సమావేశంలో మరిన్ని పన్నుల తగ్గింపు ఆశలు మదుపరుల సెంటిమెంట్ను బలపరిచాయి.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ ఏకంగా 1,921 పాయింట్లు ఎగబాకింది. చివరకు 38,014 వద్ద స్థిరపడింది. గత పదేళ్ళలో సెన్సెక్స్ ఒక్కరోజు లాభాలు ఈ స్థాయిలో ఉండటం ఇదే ప్రథమం. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 570 పాయింట్లు బలపడింది. నిఫ్టీ చరిత్రలో ఒక్క రోజులో ఇన్ని పాయింట్లు పెరగటం ఇదే ప్రథమం. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 11,274 వద్దకు చేరింది.